Engineering counseling: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే!
తెలంగాణలో ఇటీవలే విడుదలైన ఈఏపీసెట్లో ఇంజనీరింగ్ విభాగంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సెలింగ్ జరగనుంది. అయితే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలను వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.

తెలంగాణలోని ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వచ్చే నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగిన ఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్ష ఫలితాలు మే 11 వ తేదీన విడుదలయ్యాయి. ఎప్ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 73.29 శాతం ఉత్తీర్ణతతో 1,51,779 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 87.82 శాతం ఉత్తీర్ణతతో 71,309 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
అయితే ఇంజనీరింగ్ విభాగాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వచ్చే నెల (జులై) మొదటి వారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ విషయాలను విద్యార్థులు వారి తల్లి దండ్రులు దృష్టిలో పెట్టుకొని సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అగస్టు 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆయా కళాశాల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుపుతామని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా అనుమతి లేకుండా కొందరు విద్యాసంస్థలు నడుపుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. అలాంటి కాలేజీలలో విద్యార్థులు చేరుతున్నారని.. ఇలా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కొని విద్యా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈనెల 13 వరకు ఆయా సంస్థలు నోటీసులు వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన తెలిపారు. మరోవైపు బీ కేటగిరీ సీట్ల అంశంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. బీ కేటగిరి సీట్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని.. సిలబస్ మార్పుపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన అన్నారు. వివిధ కాలేజీల్లోని కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్లైన్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.