
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2015 నాటి గ్రూప్ 2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం, తుడిచివేతలున్న పార్ట్ బీ పత్రాలను పునఃమూల్యాంకనం చేయడం చెల్లదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగినట్టు కనిపిస్తున్నప్పుడు వాటిని పకన పెట్టకపోవడం సర్వీస్ కమిషన్ తప్పిదమని స్పష్టం చేస్తూ ఆ ఎంపికలను రద్దు చేసింది.
అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను టీజీపీఎస్సీ పరిశీలించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి కమిషన్ ఫలితాలు వెల్లడించిందనీ.. ఆ అంశాలను పేర్కొంటూ అప్పీలు దాఖలు చేయనున్నట్లు కమిషన్ చెబుతుంది. మరోవైపు 2016 నుంచి ఎంపికైన అభ్యర్థులంతా ఆరేళ్లుగా ఉద్యోగాలు చేస్తు సర్వీసుల్లో కొనసాగుతున్నారు. దీంతో కమిషన్తోపాటు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారూ కూడా ఈ తీర్పుపై పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
కాగా తెలంగాణలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో 439 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత అదనంగా 593 పోస్టులకు ఖాళీలు ఏర్పడటంతో 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,032కు పెరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 7.89 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ 2016 నవంబరు 11, 13 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించింది. పరీక్ష సమయంలో కొందరు అభ్యర్థులు తప్పుగా బబ్లింగ్ చేయడం వల్ల వాటిని సరిదిద్దే క్రమంలో వైట్నర్తో దిద్దడంతో న్యాయవివాదం తలెత్తింది. ఈ వివాదం కోర్టులో రెండేళ్లపాటు కొనసాగింది. అయితే అనూహ్యంగా సాంకేతిక కమిటీ సిఫార్సు చేయడంతో ఆ సమాధాన పత్రాలను కూడా మూల్యాంకనం చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరిస్తూ ఈ ఎంపిక జాబితా చెల్లదంటూ నియామకాలను రద్దు చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.