హైదరాబాద్, ఆగస్టు 9: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్ -2024 కౌన్సెలింగ్ తేదీలు మారాయ్. ఈ క్రమంలో తాజాగా రీషెడ్యూల్ విడుదల చేశారు. ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం కారణంగా.. ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియను రీషెడ్యూల్ చేస్తున్నట్లు కన్వీనర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టీజీ పీజీఈసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా సర్టిఫికెట్లను కూడా అప్లోడ్ చేయాలని సూచించారు. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 25న విడుదల చేస్తారు. ఇక ఆగస్టు 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానిక అవకాశం ఇస్తారు. ఆగస్టు 29న వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ 1వ తేదీన సీట్ల కేటాయింపు.. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 2 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ను విడుదల చేశారు.
కాగా తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) 2024 పరీక్ష ఆన్లైన్ విధానంలో జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించగా.. మొత్తం 20,626 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 18 విడుదలైన సంగతి తెలిసిందే. వీరిలో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. పీజీఈసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మడీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు కనీస అర్హత మార్కులు ఉండవు. అంటే ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు.