
అమరావతి, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ మరో భారీ గుడ్న్యూస్ చెప్పింది. దాదాపు పది వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వేదికగా అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ ఫెయిర్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నాస్కామ్ ప్రైమ్ కెరీర్ ఫెయిర్.. 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు దాదాపు 10 వేలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించడమే లక్ష్యంగా జరగనుంది. ఈ మేరకు కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన గురువారం సాయంత్రం (ఫిబ్రవరి 27) విడుదల ఆవిష్కరించారు.
కాగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM).. ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తోంది. మార్చి 5, 6 తేదీల్లో విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వేదికగా ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. టెక్, ఆర్ట్స్, సైన్స్, ఐటీఐ, పాలిటెక్నిక్ అండ్ డిప్లమా కోర్సులకు సంబంధించి 2004 నుంచి 2025 వరకు పాస్అవుట్ విద్యార్థులందరూ ఈ కెరీర్ ఫెయిర్కు అర్హులేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తొలుత వచ్చిన దరఖాస్తులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 3వ తేదీలోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2025) పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఐఐటీ రూర్కీ తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యంతరాలను మార్చి 1వ తేదీ వరకు తెల్పవచ్చని పేర్కొంది. అయితే అభ్యంతరాలు లేవనెత్తేవారు ఒక్కో ప్రశ్నకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి మార్చి 19న ఫలితాలు ప్రకటించనున్నారు. స్కోర్ కార్డులను మార్చి 28 నుంచి మే 31వరకు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా గేట్ 2025లో వచ్చిన ర్యాంకు ద్వారా దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి నేరుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి కూడా.
గేట్ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.