AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాత్రికి రాత్రే IAS అయిన రైల్వే కూలి.. మూటలు మోసిన చేతులతోనే UPSC ర్యాంక్..’ ఇదీ శ్రీనాథ్ విజయగాథ!

'సాధించాలనే పట్టుదల ఉంటే కాదేదీ అసాధ్యం' అనే మాటను నిజం చేసి చూపించాడు కేరళకు చెందిన శ్రీనాథ్. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల మూటలు మోసి కుటుంబాన్ని పోషించిన ఈ వ్యక్తి.. అదే రైల్వే స్టేషన్‌లో లభించిన ఉచిత వైఫై సాయంతో తన కలను సాకారం చేసుకున్నాడు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వినోదం కోసం కాకుండా చదువు కోసం ఉపయోగించి చివరకు యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాడు..

'రాత్రికి రాత్రే IAS అయిన రైల్వే కూలి.. మూటలు మోసిన చేతులతోనే UPSC ర్యాంక్..' ఇదీ శ్రీనాథ్ విజయగాథ!
IAS Sreenath success story
Srilakshmi C
|

Updated on: Aug 28, 2026 | 6:25 PM

Share

కేరళలోని మున్నార్‌కు చెందిన శ్రీనాథ్‌కు వివాహమై, ఓ కుమార్తె ఉంది. చదువుకున్నప్పటికీ తనకు నచ్చిన ఉద్యోగం దొరకకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఎర్నాకులం రైల్వే స్టేషన్‌లో లైసెన్స్‌డ్ కూలీగా చేరాడు. రోజంతా ప్రయాణికుల సామాన్లు మోస్తే సుమారు రూ.500 వరకు సంపాదించేవాడు. అయితే ఆ ఆదాయం తన కుటుంబ అవసరాలకు సరిపోదని శ్రీనాథ్ తరచూ ఆందోళన చెందేవాడు. ముఖ్యంగా తన కుమార్తెకు మంచి విద్య, మెరుగైన భవిష్యత్తు అందించాలనే ఆలోచన అతనిలో బలంగా ఉండేది. అదే ఆలోచన చివరకు అతడిలో ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యాన్ని నాటింది.

కోచింగ్‌కు డబ్బుల్లేవు.. స్మార్ట్‌ఫోన్‌నే ఆయుధం

యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావాలంటే ఖరీదైన కోచింగ్, పుస్తకాలు అవసరమని చాలామంది భావిస్తారు. కానీ శ్రీనాథ్ పరిస్థితి అందుకు భిన్నం. కోచింగ్‌కు, పుస్తకాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే స్థోమత అతనికి లేదు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి రావడం శ్రీనాథ్‌కు ఎంతో ఉపయోగపడింది. అప్పు చేసి స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్, మెమొరీ కార్డు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, వీడియో పాఠాలు, ఆన్‌లైన్ సమాచారం ద్వారా యూపీఎస్సీకి సిద్ధమవడం ప్రారంభించాడు. రైల్వే స్టేషన్‌లో కూలీగా పనిచేస్తూనే ఖాళీ సమయాన్ని చదువుకు కేటాయించాడు. మూటలు మోస్తున్న చేతులే పుస్తకాలు పట్టాయి. ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్న సమయమే అతనికి చదువుకునే సమయంగా మారింది.

మూడు సార్లు ఓటమి.. నాలుగో ప్రయత్నంలో విజయం

యూపీఎస్సీ లక్ష్యంగా సిద్ధమవుతున్న శ్రీనాథ్.. 2018లో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. ఈ పరీక్షను తనకు ఒక ప్రీ-ఫైనల్‌గా భావించాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. కేరళ పీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు. దీంతో రైల్వే కూలీ జీవితానికి ముగింపు పలికాడు. ఉద్యోగం రావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కానీ శ్రీనాథ్ లక్ష్యం మాత్రం అక్కడితో ఆగిపోలేదు. తన అసలు లక్ష్యం ఐఏఎస్ కావడమేనని శ్రీనాథ్‌కు తెలుసు. అందుకే ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షకు తన ప్రయత్నాలను కొనసాగించాడు. మొదటి ప్రయత్నంలో విజయం దక్కలేదు. రెండోసారి కూడా నిరాశే ఎదురైంది. మూడో ప్రయత్నంలోనూ అనుకున్న ఫలితం రాలేదు. అయినా శ్రీనాథ్ వెనక్కి తగ్గలేదు. 2022లో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సామాన్లు మోసిన వ్యక్తి.. ఇప్పుడు దేశ పరిపాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మొబైల్‌తో సమయాన్ని వృథా చేయకుండా.. జీవితాన్ని మార్చుకోవచ్చు!

శ్రీనాథ్ విజయానికి వెనుక కేవలం ఉద్యోగం సాధించాలనే కోరిక లేదు. తన కుమార్తెకు తాను అనుభవించలేని మంచి బాల్యం, మంచి విద్య, మెరుగైన జీవితం అందించాలనే తండ్రి తపన ఉంది. కష్టాలను చూసి ఆగిపోకుండా.. వాటినే తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడు. డబ్బు లేకపోవడం తన కలకు అడ్డంకి కాదని నిరూపించాడు. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ను చాలామంది వినోదం, సోషల్ మీడియా, వీడియోలు, గేమ్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ శ్రీనాథ్ మాత్రం అదే స్మార్ట్‌ఫోన్‌ను తన జీవితాన్ని మార్చుకునే సాధనంగా ఉపయోగించాడు. సాంకేతికత మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లక్ష్యంపై నమ్మకం ఉంటే మార్గం తప్పకుండా దొరుకుతుందని శ్రీనాథ్ కథ చెబుతోంది. డబ్బు లేకపోవడం ఓటమికి కారణం కాదు.. పట్టుదల లేకపోవడమే అసలు ఓటమి. కల పెద్దదిగా ఉన్నా.. మొదటి అడుగు చిన్నదే కావచ్చు. ఒక స్మార్ట్‌ఫోన్, ఉచిత వైఫై, ఖాళీ సమయం, చదువుకోవాలనే పట్టుదలతో ప్రారంభమైన శ్రీనాథ్ ప్రయాణం చివరకు ఐఏఎస్ లక్ష్యాన్ని చేరుకుంది. కలలు కనండి.. వాటిని నెరవేర్చుకునే వరకు ఆగకండి. శ్రీనాథ్ విజయగాథ నేటి యువతకు అదే సందేశాన్ని ఇస్తోంది.

Follow Us