న్యూఢిల్లీ, జూన్ 23: నీట్ యూజీ, యూజీసీ నెట్ 2024 పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. ఈ క్రమంలో జూన్ 25, 26, 27 తేదీల్లో జరగాల్సిన సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) జూన్-2024 వాయిదా వేస్తున్నట్లు యూజీసీ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తాజా పేపర్ లీక్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తన ప్రకటనలో వెల్లడించింది. పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలో వెబ్సైట్లో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
కాగా సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్ఎఫ్తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్డీ ప్రవేశాల కోసం యేటా యూజీసీ సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జేఆర్ఎఫ్ అందుతుంది. దీనితోపాటు సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. అలాగే జేఆర్ఎఫ్ అర్హత సాధిస్తే డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికకావచ్చు.
ఇప్పటికే నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దుమారం లేపుతోంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పనితీరును తప్పుపడుతున్నారు. నీట్లో అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై నిప్పులు చెరిగిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.