‘నిజమే..12 తరగతి జవాబు పత్రాలు మారాయ్..’ ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న CBSE బోర్డు
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో జరిగిన లోపాలు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశాయి. ఇటీవల ఓ సీబీఎస్సీ 12వ తరగతి విద్యార్థి సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఫిజిక్స్ ఆన్సర్ షీట్ మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సీబీఎస్ఈ మూల్యాంకనంలో జరిగిన లోపాలను అధికారికంగా అంగీకరించింది..

హైదరాబాద్, మే 27: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో జరిగిన లోపాలను బోర్డు అధికారికంగా అంగీకరించింది. సీబీఎస్సీ 12వ తరగతి రీ వాల్యుయేషన్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారి తీసింది. బోర్డు స్కాన్ చేసిన సమాధాన పత్రాలు తమవి కావని, అందులోని చేతి రాత వేరే వాళ్లవని పలువురు విద్యార్ధులు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలను నెట్టింట వైరల్ అయ్యాయి. పరీక్షల మూల్యాంకనంలో ప్రవేశపెట్టిన ‘ఆన్స్ర్కీన్ మార్కింగ్’ (OSM) విధానంలో జరిగిన సాంకేతిక లోపాల వల్లే విద్యార్థుల పేర్లు పరస్పరం తారుమారయ్యాయనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై స్పందించిన సీబీఎస్సీ బోర్డు పేపర్ల తారుమారు తమ తప్పిదమేనని అంగీకరించింది. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు ఈ సందర్భంగా బోర్డు ప్రకటించింది. అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ.. మే 23న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు పోస్టులు చేస్తూ తనకు సీబీఎస్ఈ అందించిన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ తనది కాదని ఆరోపించాడు. కొత్తగా అమలు చేస్తున్న ఆన్లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ (OSM) వ్యవస్థ ద్వారా అందించిన ఫోటోకాపీల్లో ఈ పొరపాటు గుర్తించినట్లు తెలిపాడు. ఫిజిక్స్లో ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో రీ-వాల్యుయేషన్ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్న వేదాంత్కి బోర్డు ఇచ్చిన కాపీ తనది కాదని గుర్తించి ఎక్స్లో పోస్టు చేశాడు. ఈ ఘటనతో తన భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. సదరు విద్యార్థి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ కావడంతో ఫిజిక్స్ ఆన్సర్ షీట్ గందరగోళం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
I am a CBSE Class 12 student.
After receiving unexpectedly low marks in Physics, we applied for photocopies of my answer sheets through the CBSE reevaluation process.
Today we received the copies.
And I am shattered because the Physics answer sheet uploaded by CBSE is not mine
— VEDANT (@VEDANTSHRIV17) May 23, 2026
ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీబీఎస్ఈ స్పందించింది. ఫిజిక్స్ ఆన్సర్ షీట్లో జరిగిన పొరపాటును అంగీకరించిన బోర్డు, కెమిస్ట్రీ ఆన్సర్ షీట్కు సంబంధించిన మరో ఫిర్యాదును కూడా స్వీకరించింది. దీంతో మూల్యాంకన విధానం, డిజిటల్ వెరిఫికేషన్ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన సీబీఎస్ఈ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) వేదాంత్కు లేఖ రాసి, అతని అసలు ఫిజిక్స్ ఆన్సర్ బుక్ను జతచేశారు. అలాగే మార్కులను సవరించి ఫలితాలను తిరిగి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో సీబీఎస్ఈ మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత, డిజిటల్ వ్యవస్థల నాణ్యతపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




