AP Inter Exams 2025: ఇంటర్ పరీక్షలకు 1535 కేంద్రాలు.. సర్వం సిద్ధం! మార్చి 1 నుంచి పరీక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ విద్యాశాఖ అధికారులతో గురువారం (ఫిబ్రవరి 20) సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా.. అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు..

అమరావతి, ఫిబ్రవరి 21: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ విద్యాశాఖ అధికారులతో గురువారం (ఫిబ్రవరి 20) సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు ముమ్మరంగా జరుగుతాయని, ఈ నెలల్లో పరీక్షలు సజావుగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆయన ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా.. అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆయా సెంటర్లలో ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని విజయానంద్ అధికారులను ఆదేశించారు.
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ప్రథమ చికిత్స, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధించాలని, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ కేంద్రాలు పూర్తిగామూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తగిన సంఖ్యలో బస్సులను నడపాలని విద్యాశాఖ కార్యదర్శి కె శశిధర్ అన్నారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశామన్నారు. ఆ మేరకు జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు నెలకొల్పాలని కలెక్టర్లకు సూచించారు.
పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించొద్దని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్లో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.