MS Dhoni : చరిత్రలో మొదటిసారి చిక్కుల్లో ధోనీ.. కమర్షియల్ మాఫియా అంటూ బోర్డు సంచలన నోటీసు
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ , లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ షాక్ ఇచ్చింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన పాత నివాసానికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ నుంచి నోటీసులు అందాయి.

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హౌసింగ్ బోర్డ్ షాక్ ఇచ్చింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన పాత నివాసానికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ నుంచి నోటీసులు అందాయి. నివాస అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనేది బోర్డు ప్రధాన అభ్యంతరం. ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ బోర్డు ధోనీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ పంపిన ఈ నోటీసుల ప్రకారం.. ధోనీకి కేటాయించిన ప్లాట్ నంబర్ H-(10)A లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు బోర్డు గుర్తించింది. ఈ ప్లాట్ను కేవలం నివాసం కోసం మాత్రమే 2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీకి బహుమతిగా ఇచ్చింది. అయితే అక్కడ ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని బోర్డు స్పష్టం చేసింది. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా ధోనీ తన వివరణను బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ధోనీ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, సదరు ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని బోర్డు సిఫార్సు చేసే అవకాశం ఉంది.
అసలు వివాదానికి కారణం ఏంటంటే.. ధోనీకి చెందిన ఈ పాత ఇంట్లో ప్రస్తుతం నీబర్గ్ పల్స్ డయాగ్నోస్టిక్స్ అనే ల్యాబ్ నడుస్తోంది. హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు ఒక పర్యాటక ప్రాంతం లాంటిది. ఇంటి గోడలపై ధోనీ పేరు, జెర్సీ నంబర్ 7, ఆయన ఫేమస్ హెలికాప్టర్ షాట్ చిత్రాలు ఉండటంతో ఫ్యాన్స్ అక్కడ సెల్ఫీలు దిగుతుంటారు. అయితే ధోనీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి రాంచీ శివార్లలోని సిమలియాలో ఉన్న భారీ ఫామ్హౌస్లో నివసిస్తున్నారు. హర్ములోని పాత ఇంట్లో నివసించడం మానేసిన తర్వాత, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ మొదలవ్వడం ఇప్పుడు చిక్కుల్లోకి నెట్టింది.
హౌసింగ్ బోర్డ్ చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. కేవలం ధోనీకే కాకుండా, ఇలా నిబంధనలు ఉల్లంఘించిన మిగిలిన ప్లాట్ యజమానులకు కూడా నోటీసులు పంపినట్లు తెలిపారు. చట్టం అందరికీ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న ధోనీకి ఈ నోటీసు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన 44 ఏళ్ల ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన చివరి సీజన్ ఆడే అవకాశం ఉంది. మరి ఈ భూవివాదంపై మిస్టర్ కూల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
