విజయవాడ, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న పదో తరగతి విద్యార్ధుల నిరీక్షణకు రేపు తెరపడనుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు సోమవారం (ఏప్రిల్ 22) విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఈ మేరకు విద్యా శాఖ కమీషనర్ సురేష్కుమార్ చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే టెన్త్ ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 6,30,633 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించగా.. వారిలో 6,16,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను టీవీ9 అధికారిక వెబ్ సైట్ లో ఒక్క క్లిక్ తో చెక్ చేసుకోండి.
అటు తెలంగాణలోనూ ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక పదో తరగతి పరీక్షల ఫలితాలు కూడా ఏప్రిల్ 30వ తేదీన లేదా మే 1వ తేదీన ప్రకటించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.