అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా గతంలో ఇచ్చిన తేదీలను మరికొన్ని రోజులకు ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జులై 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువును జులై 20 వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని విద్యార్ధులకు సూచించింది. స్పెషల్ క్యాటగిరీ విద్యార్ధులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జులై 18 నుంచి 20 వరకు జరుగుతుందని పేర్కొంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు జులై 23 నుంచి 26 వరకు సమయం ఇచ్చింది.
వెబ్ ఐచ్ఛికాల మార్పు చేసుకోవడానికి జులై 27న అవకాశం ఇస్తారు. జులై 31న సీట్ల కేటాయింపు చేయనున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసినట్లు వివరించింది. ఎన్సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్ఆర్ఆర్ కాలేజీ- విజయవాడ, డాక్టర్ వీఎస్ కృష్ణ కాలేజీ-విశాఖపట్నం, ఎస్వీ విశ్వవిద్యాలయం-తిరుపతిలో సహాయ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ వంటి పలు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, B.Voc, బీఎఫ్ఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీ స్ట్రీమ్లు మినహా మిగతా కోర్సులకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ విద్యార్ధులు రూ.400, బీసీ విద్యార్ధులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ. 200 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.