
హైదరాబాద్, ఏప్రిల్ 21: జేఈఈ మెయిన్ 2025 తుది ర్యాంకులు శుక్రవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 19) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 2,50,236 మంది కనీస కటాఫ్ పర్సంటైల్ స్కోర్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. ఆ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) కటాఫ్తోపాటు అర్హుల జాబితాను విడుదల చేసింది. మెయిన్కు రెండు విడతల్లో కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 15.39 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14.75 లక్షల మందే పరీక్షలు రాశారు. అయితే చివరకు 2.50 లక్షల మంది మాత్రమే కనీస మార్కులు సాధించారు.
వీరంతా దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించవల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 2025కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 చొప్పున ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 11వ తేదీన విడుదల అవుతాయి.
ఇక మే 18వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశ వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో జరగనుంది. మే 18న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలే జూన్ 2వ తేదీన వెల్లడిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసి సీట్లను భర్తీ చేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5న ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.