EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..?
ఈపీఎఫ్ఓకు సంబంధించి చాలామందిలో అనేక సందేహాలు ఉంటాయి. ప్రతీ నెలా జమ అయ్యే సొమ్ము ఎక్కడికి వెళ్తుంది అనే విషయం చాలామందికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. అయితే ఈపీఎఫ్ఓ సంస్థ ఈ డబ్బులను వివిధ చోట్ల పెట్టుబడులు పెడుతుంది.

దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. మన శాలరీ అకౌంట్ నుంచి కొంత మొత్తం యాజమాన్యం కట్ చేసి ఈ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తోంది. అలాగే యాజమాన్యం కూడా సరిసమానమైన వాటా అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఫండ్ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్లలో జమ అయ్యే నగదు ఏమవుతుంది..? వీటిని ఎక్కడ పెట్టుబడి పెడతారు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
పీఎఫ్ ఫండ్ను వివిధ చోట్ల ఈపీఎఫ్ఓ పెట్టుబడి పెడుతుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తాజా డేటా ప్రకారం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS) కింద నిర్వహించబడుతున్న ఆస్తులలో 85 శాతం EPFO, ఇతర ప్రావిడెంట్ ఫండ్లకు చెందినవేనని తేలింది. పీఎంఎస్ ఖాతాల్లో రూ. 36.72 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఇందులో రూ. 31.04 లక్షల కోట్లు ఈపీఎఫ్ఓ, ఇతర ప్రావిడెంట్ ఫండ్లకు సంబంధించినవి ఉన్నాయి. సెబీ జూన్ 2026 డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. PMS పరిశ్రమ నిర్వహించే ఆస్తులలో 80 శాతం కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ నిధుల నుండే వస్తున్నాయి. పీఎంఎస్ కేవలం సంపన్నుల మాత్రమే పెట్టుబడి పెట్టే సాధనంగా పాపులర్ అయింది. అయితే పదవీ విరమణ ఫండ్లు కూడా ఇందులో ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాయి. పీఎంఎస్లో అధిక రాబడుల కంటే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. దీంతో ఈపీఎఫ్ఓ ఇందులో పెట్టుబడి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
PMS కింద పెట్టుబడులను నిర్వహించడానికి SEBIలో నమోదైన పోర్ట్ఫోలియో మేనేజర్లను ఈపీఎఎఫ్ఓ నియమించుకుంది. అయితే పెట్టుబడి వ్యూహం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, పెట్టుబడి కమిటీల పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది. పోర్ట్ఫోలియో మేనేజర్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన పెట్టుబడి మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. EPFO నిధులను ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, కార్పొరేట్ బాండ్లు, ఇతర రుణ సాధనాలలో పెట్టుబడి పెడతున్నారు. ఈక్విటీలలో 15 శాతం మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారు. ఇండెక్స్ ETFల ద్వారా వీటిని ఇన్వెస్ట్ చేస్తున్నారు. EPFO పెట్టుబడి వ్యూహం రాబడులను గరిష్ఠం చేయడం కంటే పదవీ విరమణ పొదుపును పరిరక్షించడంపైనే దృష్టి పెట్టింది. ఈ విధానం పదవీ విరమణ నిధికి పని చేసినప్పటికీ.. దీర్ఘకాలిక సంపద సృష్టిని కోరుకునే యువ పెట్టుబడిదారులకు, వారి ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీలకు అదనపు కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు.
