AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయపెడుతున్న చమురు సంక్షోభం..! మనకే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పు?

పశ్చిమ ఆసియా యుద్ధం ప్రపంచ చమురు సరఫరాను తీవ్రంగా దెబ్బతీస్తోంది. హార్ముజ్ జలసంధిలో అంతరాయాలతో బ్రెంట్ క్రూడ్ ధరలు 50-60 శాతం పెరిగాయి. వ్యూహాత్మక నిల్వలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత, ఆహార, ఎరువుల ధరల పెరుగుదల, స్టాగ్ఫ్లేషన్ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భయపెడుతున్న చమురు సంక్షోభం..! మనకే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పు?
Oil Supply Crisis
SN Pasha
|

Updated on: Apr 05, 2026 | 3:43 PM

Share

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధానికి నెలరోజులు దాటినా, ప్రపంచ చమురు సరఫరాలపై ప్రభావం మరింత గంభీరంగా మారుతోంది. ముఖ్యంగా స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ ప్రాంతంలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలపై వరుస దాడులు, ట్యాంకర్ మార్గాల మార్పు, పెరిగిన రవాణా ఖర్చులు కలిసి సప్లయ్‌ చైన్‌ను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 60–70 డాలర్ల స్థాయి నుంచి 100–120 డాలర్ల శ్రేణికి పెరిగి, దాదాపు 50–60 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఈ పెరుగుదల పూర్తిస్థాయి సరఫరా కొరతను ఇంకా ప్రతిబింబించడం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు ఇప్పటికీ ఈ అంతరాయాన్ని తాత్కాలికంగా భావిస్తున్నాయని, కానీ వాస్తవ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వారు హెచ్చరిస్తున్నారు.

ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ మనోరంజన్ శర్మ అభిప్రాయం ప్రకారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల మార్కెట్లు త్వరగా స్పందించినా, దీర్ఘకాలిక ప్రమాదాలను తరచుగా తక్కువగా అంచనా వేస్తాయి. ప్రస్తుతం చమురు మార్కెట్ రిస్క్ ఆధారిత దశ నుంచి సరఫరా సున్నిత దశకు మారుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిమిత అదనపు ఉత్పత్తి సామర్థ్యం, తక్కువ పెట్టుబడులు, పెరుగుతున్న రాజకీయ విభజనలు ఈ పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం రోజుకు సుమారు 7 మిలియన్ బ్యారెళ్ల వరకు సరఫరా లోటు ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లోటు ఇప్పటివరకు పూర్తిస్థాయి గ్లోబల్ కొరతగా మారకపోయినా, ఆసియా దేశాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. గల్ఫ్ చమురుపై అధిక ఆధారపడే దేశాలకు సరఫరా కష్టతరం అవుతోంది.

ఇక ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసిన 400 మిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక నిల్వలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తున్నాయి. ఇవి ప్రపంచ వినియోగానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సంక్షోభాన్ని పూర్తిగా నివారించడం కాకుండా, కేవలం ఆలస్యం చేయడమే జరుగుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఎరువులు, ఆహార ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతం యూరియా, అమ్మోనియా ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంతో, వ్యవసాయ రంగంపైనా ప్రభావం పడే అవకాశముంది.

దీర్ఘకాలికంగా ఈ సంక్షోభం కొనసాగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్తబ్ద ద్రవ్యోల్బణం (స్టాగ్ఫ్లేషన్) పరిస్థితులు తిరిగి రావచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1973 చమురు సంక్షోభాన్ని పోలి ఉండే ఈ పరిస్థితి, ముఖ్యంగా ఆసియా దేశాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక సరఫరా అసమతుల్యతలు పెరుగుతున్నాయి. యుద్ధం త్వరగా ముగియకపోతే, ఈ అంతరాయం పూర్తి స్థాయి గ్లోబల్ చమురు సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us