AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశం నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు! ఇప్పటికే బయలుదేరిన ఓడలు..

అమెరికా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్‌లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వెనిజులా నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరాలు భారీగా పెరుగుతున్నాయి. అతి భారీ ట్యాంకర్లు (VLCCలు) వినియోగంతో రవాణా ఖర్చులు తగ్గి, సరఫరా వేగం పుంజుకుంటోంది. రష్యన్ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, డిస్కౌంట్ ధరల వద్ద లభించే వెనిజులా హెవీ క్రూడ్‌ను భారత రిఫైనరీలు వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నాయి.

ఆ దేశం నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు! ఇప్పటికే బయలుదేరిన ఓడలు..
Venezuela Crude Oil India
SN Pasha
|

Updated on: Feb 25, 2026 | 6:30 AM

Share

అమెరికా ఆంక్షల సడలింపుల తర్వాత ప్రపంచ చమురు మార్కెట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వెనిజులా నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కారకాస్–వాషింగ్టన్ మధ్య సరఫరా వ్యవస్థ తిరిగి ప్రారంభం కావడంతో ఒక్కోటి సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోయగల అతి భారీ ట్యాంకర్లు భారత తీరాల వైపు వస్తున్నాయి. ఇది గత కొన్నేళ్లలో చమురు వాణిజ్య ప్రవాహాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వెనిజులా చమురు వ్యాపార సంస్థలు, అంతర్జాతీయ కొనుగోలుదారులు మొదటిసారి VLCCలు (వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్)ను పెద్ద ఎత్తున చార్టర్ చేశాయి. ఈ సూపర్ ట్యాంకర్లు సాధారణ సూయజ్‌మాక్స్ నౌకల కంటే దాదాపు రెట్టింపు సామర్థ్యం, ఆఫ్రామాక్స్ నౌకల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ముడి చమురును మోయగలవు. దీంతో రవాణా ఖర్చులు తగ్గి, సరఫరా వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విటోల్, ట్రాఫిగురా వంటి ప్రముఖ ట్రేడింగ్ సంస్థలు చార్టర్ చేసిన Nissos Kea, Nissos Kythnos, Arjana వంటి కనీసం మూడు VLCCలు మార్చిలో వెనిజులాలోని జోస్ టెర్మినల్ వద్ద లోడింగ్‌కు షెడ్యూల్ అయ్యాయి. ఈ టెర్మినల్‌ను వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSA నిర్వహిస్తోంది. మరో సూపర్ ట్యాంకర్ Olympic Lion కూడా వెనిజులాను గమ్యస్థానంగా సూచించినట్లు సమాచారం. ఈ నౌకల్లోని ఎక్కువ సరుకు భారతదేశానికి చేరనున్నట్లు వర్గాలు తెలిపాయి.

భారతీయ శుద్ధి కర్మాగారాల కోసం ఇది వ్యూహాత్మక సమయంలో వచ్చిన పరిణామంగా భావిస్తున్నారు. అమెరికా ఆంక్షలు అమలులోకి రావడానికి ముందు భారతదేశం వెనిజులా ముడి చమురును కొనుగోలు చేసే మూడవ అతిపెద్ద దేశంగా ఉండేది. ఇప్పుడు పరిమితులు సడలించడంతో వాణిజ్యం మళ్లీ వేగం పుంజుకుంటోంది. అమెరికాకు చెందిన చెవ్రాన్ సంస్థ కూడా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వెనిజులా బోస్కాన్ హెవీ క్రూడ్‌ను భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించడం గమనార్హం.

రష్యన్ చమురుపై ఆధారాన్ని తగ్గించేందుకు భారత్ వనరులను వైవిధ్యపరచాలని చూస్తుండగా, వెనిజులా డిస్కౌంట్ మేరీ హెవీ క్రూడ్ భారత రిఫైనరీలకు ఆకర్షణీయంగా మారింది. జనవరిలో వెనిజులా చమురు ఎగుమతులు రోజుకు సుమారు 8 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. పెద్ద ట్యాంకర్ల వినియోగం పెరగడంతో, నిల్వలో ఉన్న మిలియన్ల బ్యారెళ్ల చమురును భారత్ వంటి కొనుగోలుదారులు త్వరగా గ్రహించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us