Vande Bharat Sleeper: ఈ రూట్లలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్.. రైల్వేశాఖ నుంచి బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చేసింది. 9 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ వెర్షన్లో ఒక రైలును మాత్రమే ప్రవేశపెట్టారు. ఆగస్ట్లో మరికొన్ని రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ సిద్దమవుతోంది.

దేశంలో ఇప్పటికే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తుండగా.. మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఇప్పటికే స్లీపర్ రైల్వే సెట్ల తయారీ జరుగుతుండగా.. త్వరలోనే వివిధ మార్గాల్లో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధాన నగరాలకు కనెక్టివిటీ లభించేలా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాత్రిపూట ప్రయణాన్ని మెరుగుపర్చేందుకు వందే భారత్ స్లీపర్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. హౌరా-గువహతి మధ్య ఈ ఏడాది జనవరిలో తొలి స్లీపర్ ట్రైన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తొమ్మిది కొత్త మార్గాల్లో తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణలో భాగంగా వందే భారత్ రైళ్లు స్లీపర్ కోచ్లను తీసుకురానుంది. సాధారణ వందే భారత్ రైళ్లు ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల మీదుగా నడుస్తోండగా.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై రైల్వేశాఖ దృష్టి సారిస్తోంది.
ఈ 9 మార్గాల్లో వందే భారత్ స్లీపర్
సుదూర ప్రయాణాల కోసం రూపొందించబడిన ఈ రైళ్లు.. రాత్రిపూట ప్రయాణానికి అనువుగా ఉంటాయి. త్వరలో తొమ్మిది రూట్లలో వందే భారత్ స్లీపర్ కోచ్లకు ప్రణాళికలు వేసింది. ఢిల్లీ-ముంబై , ముంబై-బెంగళూరు, న్యూఢిల్లీ-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-చెన్నై, న్యూఢిల్లీ-సికింద్రాబాద్, న్యూఢిల్లీ-పుణె, ముంబై-అహ్మదాబాద్, న్యూఢిల్లీ-శ్రీనగర్ మార్గాల్లో ప్రవేశపెట్టనుంది. బలమైన ప్రయాణికుల డిమాండ్, ప్రధాన అంతర్-నగర అనుసంధానాలుగా వాటికి ప్రాముఖ్యత ఉండటంతో ఈ మార్గాలను పరిశీలిస్తోంది. ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రానున్న కొద్ది నెలల్లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి రైలు ఫస్ట్ ఏసీ కోచ్ డిజైన్ ఆవిష్కరించారు. ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక క్యాబిన్లు, అప్గ్రేడ్ చేయబడిన సౌకర్యాలతో విమానాన్ని తలపించేలా ఉంది. ఈ కోచ్లలో శుభ్రమైన అమరిక, మెరుగైన లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్లు, స్థలాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. అనుధాతన వాష్రూమ్లు, సమాచార ప్రదర్శన వ్యవస్థలు, పటిష్టమైన భద్రతా చర్యలు. సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రానుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రాజధాని ఎక్స్ప్రెస్ నడుస్తుండగా.. ఇందులో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. అదే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే వేగవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఈ రూట్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వందే భారత్ స్లీపర్ తీసుకురావడం వల్ల రాత్రిపూట ప్రయాణం చేసేవారికి ఊరట కలగనుంది. హాయిగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశ లభిస్తుంది.
