ప్రస్తుతం అంతా డిజిటల్ మేనియా నడుస్తుంది. గతంలో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ పీసీఐ ద్వారా చేపట్టే యూపీఐ లావాదేవీలు దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అంతా ఎక్కడకెళ్లినా తమ మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ తో తమ చెల్లింపులను నిరాటంకంగా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిని వేధించే సమస్య నెట్ వర్క్ ఇష్యూ. మన ఫోన్స్ లో నెట్ వర్క్ ఇష్యూ లేదంటే బ్యాంక్ సర్వర్ డౌన్ కారణంగా మనం యూపీఐ పేమెంట్ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటాం. అయితే ఈ సమస్య మన షాపింగ్ లో ఎదురైతే పర్లేదు..హోటల్లో తిన్న తర్వాత పేమెంట్ జరగకపోతే అప్పుడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి సరికొత్తగా యూపీఐ లైట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నెట్ లేకపోయినా రూ.200 లోపు ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.
యూపీఐ లైట్లో వర్చువల్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఎన్పీసీఐకి కాకుండా, జారీ చేసే బ్యాంకు ద్వారా మాత్రమే పని చేస్తుంది. యూపీఐ లైట్ బ్యాలెన్స్పై వడ్డీ చెల్లించరు. యూపీఐ లైట్ చెల్లింపు వ్యవస్థ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్, కెనరా, హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా, ఇండియన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటలో ఉంది. యూపీఐ లావాదేవీలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. కానీ రిసీవర్ ఖాతాలోకి క్రెడిట్లు ఆన్లైన్లో చేస్తారు. అయితే, యూపీఐ లైట్ని పూర్తిగా ఆఫ్లైన్గా మార్చే భవిష్యత్తు ప్రణాళిక ఉందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..