
డేటా చోరీ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడం.. ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. ఇవి కాకుండా.. ఇన్వెస్ట్ మెంట్ పెరుతో కూడా మోసాలు జరుగుతుంటాయి. అలాంటివే ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్. ఇవెలా ఉంటాయంటే..
సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా వాట్సాప్ ప్రమోషనల్ మెసేజ్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో నకిలీ స్కీమ్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడతారు. స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉందని, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే.. మంచి ప్రాఫిట్స్ వస్తాయని.. కొంత మొత్తం చెల్లిస్తే.. మేము గైడెన్స్ ఇస్తామని నమ్మిస్తారు. వాళ్ల మాటలు నమ్మి వాళ్ల వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రాం గ్రూపుల్లో జాయిన్ అయితే ఇక అంతే సంగతి.. ఇన్వెస్ట్ మెంట్స్ చేసేందుకు వీళ్లే ఒక యాప్ క్రియేట్ చేస్తారు. అవి అచ్చం గ్రో, జిరోదా వంటి ఇన్వెస్ట్ మెంట్ యాప్స్ ను పోలి ఉంటాయి. అందులో మనకు తెలిసిన కంపెనీల స్టాక్స్ కనిపిస్తాయి. కానీ, అవన్ని వాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ వివరాలు. అది తెలియక అందులో ఇన్వెస్ట్ చేస్తే.. ఇక అంతే సంగతులు. ఒకసారి యాడ్ చేసిన డబ్బు మళ్లీ తిరిగి రాదు.
ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి కొంత ఐడియా ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తూ.. ఈ స్కామ్ అమలు చేస్తారు. కొత్తగా కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుందని.. తక్కువ స్టాక్ ప్రైస్ తో ఐపీఓకి వెళ్తుందని త్వరగా ఇన్వెస్ట్ చేస్తే.. ప్రాఫిట్స్ అని నమ్మించి ఫేక్ లింక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయిస్తారు. అది నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు గోవిందా.
ఇక వీటితోపాటు ఆయిల్ ట్రేడింగ్ అని.. క్రిప్టో ట్రేడింగ్ అని.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే నాలుగైదు నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయని.. ఇలా నకిలీ యాప్స్ తో చాలా రకాలైన ఇన్వెస్ట్ మెంట్ స్కామ్స్ జరుగుతాయి. వీటిని చూసి ఆశ పడితే మొదటికే మోసపోక తప్పదు. కాబట్టి ఇలాంటి స్కామ్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..