
వెండి మార్కెట్ ప్రస్తుతం ఒక రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని తలపిస్తోంది. 2026 ప్రారంభంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధరలు, ఇప్పుడు అంతే వేగంగా కిందికి దిగి వస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే కిలో వెండి ధర ఏకంగా రూ.2 లక్షల వరకు పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. 2025లో 170 శాతం, 2026 జనవరిలో 74 శాతం వృద్ధిని నమోదు చేసిన వెండి, జనవరి 29న కిలోకు రూ.4.39 లక్షల వద్ద ఆల్-టైమ్ రికార్డును తాకింది. అయితే అప్పటి నుండి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మే సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోకు సుమారు రూ.2.38 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇది 2025 ముగింపు ధర (రూ. 2.41 లక్షలు) కంటే తక్కువ కావడం గమనార్హం.
వెండి ధరల పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి
మార్జిన్ కాల్స్: పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇతర రంగాల్లో వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వెండి నిల్వలను విక్రయించి నగదును పోగు చేసుకుంటున్నారు.
వడ్డీ రేట్ల ప్రభావం: ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు అధికంగా ఉంచే అవకాశం ఉంది. దీనివల్ల వెండి వంటి రాబడినివ్వని ఆస్తులపై ఆకర్షణ తగ్గింది.
బలమైన డాలర్: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీల్లో వెండి కొనుగోలు ప్రియంగా మారింది. దీంతో డిమాండ్ తగ్గుముఖం పట్టింది.
ఫెడ్ రిజర్వ్ వైఖరి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్ కెవిన్ వార్ష్ ఆధ్వర్యంలో వడ్డీ రేట్ల కోత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉండటం కూడా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది.
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం.. వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు దీనికి పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. అందుకే ఇది బంగారం కంటే ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. ధరలు తగ్గినప్పటికీ, మార్కెట్ వరుసగా ఆరవ సంవత్సరం సరఫరా కొరతను ఎదుర్కొంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వెండి మౌలిక అంశాలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం ధరలు తగ్గిన తరుణంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు వెండిని ఒక అవకాశంగా చూడవచ్చు. అయితే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరియు డాలర్ కదలికలను గమనిస్తూ అడుగు వేయడం ఉత్తమం.