
ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు సౌకర్యానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ప్రయాణానికి అనువుగా ఉండే వాహనాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి బండి చాలా అవసరం. అదే సమయంలో నగరంలోని ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ తదితర వాటిని దాటుకుని వెళ్లడానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. వీటికి గేర్లు లేకపోవడంతో నడపడం చాలా సులువుగా ఉంటుంది. గేర్ల మార్చే సమయంలో ఇంజిన్ ఆగిపోతుందనే భయం ఉండదు. మహిళలు చాలా సులువుగా నడవవచ్చు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వాహనాన్ని వాడుకునే వీలుంటుంది. స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 110, హోండా యాక్టివా 110, హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 ప్రజల ఆదరణ పొందాయి. వాటి ధర, ఫీచర్లు, మైలేజీ, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
ముందుగా ఈ మూడు వాహనాల ధరల వివరాలు తెలుసుకుందాం. టీవీఎస్ జూపిటర్ రూ. 73,700, హోండా యాక్టివా రూ.76,684, హీరో మాస్ట్రో ఎడ్జ్ రూ. 62,750 (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉన్నాయి.
హీరో మాస్ట్రో ఎడ్జ్ 51 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. దీనిలో 5.5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. టీవీఎస్ జూపిటర్ మైలేజ్ 64 కేఎంపీఎల్, జాతీయ రహదారిపై ప్రయాణించినప్పుడు 52 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.1 లీటర్లు. ఇక హోండా యాక్టివా 47 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుంది. దీనిలో 5.3 లీటర్ ఇంధన ట్యాంక్ ఉంది.
హీరో మాస్ట్రో ఎడ్జ్ 110.9సీసీ ఎయిర్ కూల్డ్, టీవీఎస్ జూపిటర్ 113.3సీసీ, హోండా యాక్టివా 109.51సీసీ ఇంజిన్లతో బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా వస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..