Milk Prices: సామాన్యులకు మరో షాక్.. మళ్లీ పెరగనున్న పాల ధరలు.. ఈ సారి ఎంతంటే..?
సామాన్యులకు త్వరలో మరో షాక్ తగలనుంది. పాల ధరలు మరోసారి పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మే నెలలో వీటి ధరలు పెరిగాయి. ఎల్నివో ప్రభావం, వర్షాలు లేకపోవడం వల్ల పశుగ్రాసం కొరత వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశముంది. ఈ క్రమంలో పాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

సామాన్యులకు బిగ్ షాక్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలతో ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఆహారం ధరలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో మరో వార్త ఆందోళన కల్గిస్తోంది. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే పాల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఎల్నీవో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ కారణంతో వర్షాలు సరిగ్గా లేకపోవడం, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుందని డెయిరీ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో పాల ఉత్పత్తి తగ్గే అవకాశముందని, ఇదే జరిగితే పాల ధరలను మరసారి కంపెనీలు పెంచే అవకశముందని చెబుతున్నారు.
ఎల్నివో ప్రభావం
వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూలై లేదా ఆగస్టు నాటికి పాల ధరలు 3 నుంచి 4 శాతం మేర పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. మే నెలలో అముల్, మదర్ డెయిరీతో పాటు పలు కంపెనీలు పాల ధరలను పెంచాయి. ఇప్పుడు ఎల్నీవో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదుకానుంది. దీని వల్ల పశువులకు మేతతో పాటు నీటికి కూడా కొరత ఏర్పడే పరిస్థితి వస్తుంది. దీంతో రైతులు తమ పశువులను తగ్గించుకోవడం వల్ల పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఈ కారణంతో పాల ధరలు త్వరలో పెరిగే అవకాశముంది. ఈ ఏడాది మేలో అమూల్, మదర్ డైరీ లీటరుకు రూ.2 చొప్పున పాల ధరలను పెంచాయి. పశువుల మేత, ఇంధనం, ప్యాకేజింగ్, సేకరణ ఖర్చులు పెరగడం వల్లనే పెంచినట్లు తెలిపాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కారణాలతో పెంచేందుకు సిద్దమవుతున్నాయి.
