AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata – Shantanu Naidu: వ్యాపార దిగ్గజానికి మన కుర్రోడే బెస్ట్‌ ఫ్రెండ్.. వీళ్లిద్దరి అనుబంధం ఏంటో తెలుసా..?

రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెలుగు వ్యక్తే.. అతనే శంతను నాయుడు.. రతన్‌టాటాకు అందరూ ఒక ఎత్తయితే.. శంతను నాయుడు ఒక ఎత్తు.. శంతను నాయుడు అంటే ఆయనేదో పెద్ద వయస్కుడు కాదు, బడా పారిశ్రామిక వేత్త కాదు. ఓ 31 ఏళ్ల యువకుడు.

Ratan Tata - Shantanu Naidu: వ్యాపార దిగ్గజానికి మన కుర్రోడే బెస్ట్‌ ఫ్రెండ్.. వీళ్లిద్దరి అనుబంధం ఏంటో తెలుసా..?
Shantanu Naidu - Ratan Tata
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2024 | 3:31 PM

Share

ఈ దేశం- ఒక నేషనల్‌ ఐకాన్‌ని కోల్పోయింది. రతన్‌ టాటా మన మధ్య లేరన్న విషయం.. కలచివేస్తోంది.. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి.. మానవతావాది.. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి.. దిగ్గజ కార్పొరేట్లకు అందనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌ టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్‌ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ దేశం నివాళులు అర్పిస్తోంది.. వాస్తవానికి రతన్ టాటా తన దశాబ్దాల వ్యాపార జీవితంలో ఎంతో మందితో స్నేహం చేశారు.. ఇంకా చాలా మంది ఉద్యోగులతో సన్నిహితంగా ఉండటం.. వారిపై అభిమానం చూపడం ఇవన్నీ చూసే ఉంటాం.. కానీ.. రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెలుగు వ్యక్తే.. అతనే శంతను నాయుడు.. రతన్‌టాటాకు అందరూ ఒక ఎత్తయితే.. శంతను నాయుడు ఒక ఎత్తు.. శంతను నాయుడు అంటే ఆయనేదో పెద్ద వయస్కుడు కాదు, బడా పారిశ్రామిక వేత్త కాదు. ఓ 31 ఏళ్ల యువకుడు. రతన్‌ టాటా ఈ యంగ్‌టర్క్‌ను తన కొడుకుగా ట్రీట్‌ చేస్తుంటారు. టాటా కుటుంబంతో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. రతన్ టాటాకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వార్తల్లోకెక్కాడు. మహారాష్ట్రలోని పూణేలో 1993లో పుట్టిన శంతను నాయుడు తల్లిదండ్రులు మాత్రం తెలుగు వారే.. మహారాష్ట్రలో స్థిరపడ్డారు. అయితే.. శంతను నాయుడు 2022లో టాటా ఎలాక్సీలో- ఆటోమొబైల్‌ డిజైన్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. రతన్‌ టాటాకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యారు. ఆయన అసిస్టెంట్‌గా మారారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్‌లా ఉంటారు.. తెలియని విషయాల గురించి మాట్లాడుకుంటారు.. జుంతు ప్రేమికులైన వీరు.. అనతి కాలంలోనే స్నేహితులుగా.. సొంత కుటుంబ సభ్యుల్లా మారారు. అయితే 86 ఏళ్ల రతన్ టాటా.. 31 ఏళ్ల శంతను నాయుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. వారి మధ్య సంబంధం ఎలా ఏర్పడింది.? అతను సహాయకుడిగా ఎలా మారాడు.. రతన్ టాటా ఆ యువకుడు స్థాపించిన కంపెనీలో పెట్టుబడి పెట్టడం.. ఈ విషయాలన్నీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి..

వ్యాపార దిగ్గజానికి.. కుర్రోడు ఎలా సహాయకుడిగా మారాడంటే..

సామాజిక కార్యకర్తగా, జంతు ప్రేమికుడిగా, రచయితగా, యువ పారిశ్రామికవేత్తగా సమాజంలో మార్పు తీసుకురావడానికి శంతను నాయుడు కృషి చేశారు. ఈ గుణగణాలే శంతను నాయుడిని రతన్ టాటాకు అత్యంత సన్నిహిత వ్యక్తిగా మారేలా చేశాయి.. మూగజీవాల సంరక్షణతో మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అనంతరం సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. 2014లో పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శాంతాను నాయుడు.. బిజినెస్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. జంతు ప్రేమికుడైన శంతను నాయుడు సామాజిక సేవ కోసం మోటోపౌస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ వీధి కుక్కలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు శాంతాను నాయుడు ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో.. ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చూశాడు. ఆ సంఘటన అతన్ని ఎంతగానో కలచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్‌లను రూపొందించాడు. దీనికోసం విరాళాలు సేకరించాడు. ఈ బెల్ట్‌ ధరించిన కుక్క రోడ్డు మీదికి వెళ్లినప్పుడు బెల్టులోని రంగులు వాహనాల హెడ్‌లైట్స్‌కు మెరిసి పోతాయి. దీంతో వాహనదారులు నెమ్మది కావడమో, బండిని ఆపేయడమో చేస్తారనేది శాంతాను ఆలోచన. ఈ క్రమంలో వాహనాల డ్రైవర్లకు కూడా మూగజీవాలపై అవగాహన కల్పించాడు. అయితే.. చాలామంది మూగ జీవాలకు అలాంటి బెల్టులు కావాలని కోరడంతో.. శంతను తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్‌కు లేఖ రాశాడు. దీంతో ఈ విషయం రతన్ టాటా దృష్టికెళ్లింది.. ఆ తర్వాత ముంబైకి రావాలంటూ ఆహ్వానం పంపారు. శంతనుతో మాట్లాడిన రతన్ టాటా.. వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అలా శంతాను నాయుడు ‘మోటోపాస్‌’ సంస్థ ముందుకుసాగింది.. అంతేకాకుండా ఇన్వెస్టర్స్, బిజినెస్ స్థాపించే వారు.. ఆంత్రపెన్యూర్స్‌ కోసం ‘ఆన్‌ యువర్‌ స్పార్క్స్‌’ అనే కౌన్సెలింగ్‌ ప్లాట్‌ఫామ్, అలాగే యువతకు ఉపాధి కల్పించడం కోసం ‘గుడ్‌ఫెలోస్‌’ అనే స్టార్టప్‌ సంస్థను ప్రారంభించారు. వీటిలో సైతం టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టింది.. అంతేకాకుండా.. జంతువుల కోసం ఓ ఆసుపత్రిని సైతం ప్రారంభించింది టాటా గ్రూప్..  ప్రస్తుతం టాటా ట్రస్ట్‌లోని ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ డైరెక్టర్ కూడా శంతను నాయుడే ఉన్నారు..

తొలుత ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టడం.. అచ్చం తనలానే పెట్ లవర్ అయిన శంతనును రతన్ టాటా అక్కున చేర్చుకున్నారు… అతన్ని పిలిచి పలు విషయాలను ముచ్చటించేవారు.. అలాగా.. సోషల్ మీడియా వినియోగం.. జంతువుల రక్షణ, పలు సేవా కార్యక్రమాల గురించి తరచూ మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ఈ ఫ్రెండ్‌షిప్ ఎంతవరకూ వెళ్లిందంటే.. మేనేజర్ గా చేరాలంటూ రతన్ టాటా శంతనును కోరే వరకు వెళ్లింది.. శంతను టాటా గ్రూప్ లోనే అప్రెంటింస్ చేసి.. ఆయన ట్రస్ట్‌లోనే శంతను ను మేనేజర్‌గా నియమితులయ్యారు. ఇలా అనతి కాలంలోనే.. టాటా ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటాకు మేనేజర్‌గా 2018లో చేరారు శంతను నాయుడు.. శంతను నాయుడు – రతన్ టాటా పదేళ్ల స్నేహ ప్రయాణంలో.. వారిద్దరూ ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని.. సంభాషించుకోవడం వరకు వెళ్లింది.. ఇలా రతన్ టాటాతో తనకు ఉన్న స్నేహం గురించి శంతను నాయుడు.. “ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్” అనే పుస్తకంలో సవివరంగా వెల్లడించారు..

నా ‘ప్రియమైన లైట్‌హౌస్’కి వీడ్కోలు

రతన్ టాటాను ఆప్యాయంగా పలకరించేంత చనువు, భుజాలపై చేయి వేసి మాట్లాడే స్నేహం శంతానుకు ఉండటంతో ఈ బంధాన్ని అర్థం చేసుకున్నవారంతా ‘ఏజ్‌.. జస్ట్‌ ఎ నంబర్‌’ అంటూ అభినందిస్తుంటారు. రతన్ టాటాకు స్నేహితుడు, సహాయకుడు, మేనజర్ శంతను నాయుడు సైతం కన్నీటి నివాళులర్పించారు. నా ‘ప్రియమైన లైట్‌హౌస్’కి వీడ్కోలు.. నా జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాను.. అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కాగా.. రతన్ టాటా మృతిపట్ల శంతను నాయుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా స్పందించారు. ‘‘సుధీర్ఘమైన స్నేహంలో ఓ గ్యాప్ ఏర్పడింది.. చిరస్మరణమైన క్షణాలను గుర్తుచేసుకుంటూ నా జీవితాంతం గడుపుతానే ఉంటాను.. ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాను.. నా ప్రియమైన లైట్‌హౌస్ కు వీడ్కోలు..’’ అంటూ శంతను నాయుడు పోస్ట్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us