
ఇరాన్ యుద్ధం ప్రభావంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణం త్వరలో ఖరీదైనదిగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలపై ఇంధన సర్ఛార్జ్ను దశలవారీగా అమలు చేయనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ సర్ఛార్జ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిర్వహించే సేవలకు కూడా వర్తిస్తుందని ఎయిర్లైన్ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో సరఫరా అంతరాయాలు ఏర్పడటంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఎటీఎఫ్) ధరలు మార్చి 2026 ప్రారంభం నుండి గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఎటీఎఫ్ దాదాపు 40 శాతం వాటా కలిగి ఉండటంతో ఇంధన ధరల మార్పులు నేరుగా టికెట్ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
మొదటి దశ.. దేశీయ విమానాలు, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) దేశాలకు వెళ్లే మార్గాల్లో టికెట్ ధర రూ.399 వరకు పెరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి.
రెండో దశ.. పశ్చిమ ఆసియా మార్గాల్లో సుమారు 10 డాలర్లు, ఆగ్నేయాసియా మార్గాల్లో 20 డాలర్లు, ఆఫ్రికా మార్గాల్లో 30 డాలర్ల వరకు అదనపు ఇంధన సర్ఛార్జ్ విధించబడుతుంది.
మూడో దశ.. తదుపరి దశలో హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా వంటి దూర ప్రాచ్య గమ్యస్థానాలకు కూడా ఈ సర్ఛార్జ్ విస్తరించబడుతుంది. ఈ దశకు సంబంధించిన పూర్తి వివరాలను తరువాత ప్రకటిస్తారు. ప్రస్తుతం మొదటి రెండు దశలను అమలు చేస్తున్నట్లు ఎయిర్లైన్ తెలిపింది.
భారత్లో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఎటీఎఫ్పై అధిక ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వాట్) ఉండటంతో విమానయాన సంస్థలకు ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో టికెట్ ధరలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సర్ఛార్జ్ అమలు కాకముందు జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అయితే ప్రయాణ తేదీలలో మార్పులు చేసినప్పుడు లేదా టికెట్ను తిరిగి లెక్కించినప్పుడు మాత్రమే కొత్త సర్ఛార్జ్ వర్తించవచ్చు. ఇంధన ధరలు భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఈ అదనపు ఛార్జ్ లేకపోతే కొన్ని విమానాలను నిర్వహించడం కష్టమవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఈ సర్ఛార్జ్ను సమీక్షించి మార్పులు చేయనున్నట్లు కూడా పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి