హమ్మయ్య.. దేశ ప్రజలందరికీ పండగలాంటి వార్త.. ఇక LPG కష్టాలు తీరినట్టే! ఎలా అంటే..?
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య భారత్ ఇంధన భద్రతకు కీలక ఊరట లభించింది. అమెరికా నుంచి LPG, రష్యా నుంచి ముడి చమురు మంగళూరు పోర్ట్కు చేరుకున్నాయి. ఇది పశ్చిమ ఆసియాపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్ తన ఇంధన సరఫరా వ్యూహాన్ని విస్తరిస్తున్నట్లు సూచిస్తుంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న వేళ, భారతదేశానికి కీలక ఉపశమనం లభించింది. అమెరికా నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న పైక్సిస్ పయనీర్ నౌక ఆదివారం న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకుంది. ఫిబ్రవరి 14న టెక్సాస్లోని నెదర్లాండ్స్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ నౌక, సుమారు 16,714 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ను భారతదేశానికి తీసుకువచ్చింది. ఈ సరుకును ఏజిస్ లాజిస్టిక్స్ ద్వారా అన్లోడ్ చేస్తున్నారు.
ఇక ఒక రోజు ముందే రష్యా నుంచి వచ్చిన ఆక్వా టైటాన్ ట్యాంకర్ కూడా మంగళూరు తీరానికి చేరుకుంది. సుమారు 7.7 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో వచ్చిన ఈ నౌక మొదట చైనాకు వెళ్లాల్సి ఉండగా, దారి మళ్లించి భారత్కు చేరడం గమనార్హం. ఈ ముడి చమురును సముద్రగర్భ పైప్లైన్ ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కు తరలిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్ ఇంధన సరఫరా వ్యూహంలో మార్పును సూచిస్తున్నాయి. పశ్చిమ ఆసియా నుంచి సంప్రదాయ సరఫరాలు అంతరాయం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా, రష్యా వంటి ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడటం పెరిగింది. ఇటీవల శివాలిక్, నందా దేవి వంటి నౌకలు కూడా దేశానికి ఇంధనాన్ని తీసుకువచ్చాయి.
మంగళూరు పోర్ట్ ప్రాధాన్యత కూడా వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద భూగర్భ ఎల్పీజీ నిల్వ సదుపాయం ఇక్కడే ఉండటం ప్రత్యేకత. ఈ సదుపాయం సముద్ర మట్టానికి సుమారు 225 మీటర్ల దిగువన ఉండి, 80,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తంగా గ్లోబల్ సంక్షోభ పరిస్థితుల్లో భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు విభిన్న దేశాల నుంచి సరఫరాలను సమీకరించే వ్యూహాన్ని బలోపేతం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
