Indian Railways: మారిన రైల్వే రిజర్వేషన్ టికెట్ రూల్స్.. సీటు దొరకలేదనే టెన్షన్ ఉండదు.. ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు..
రైల్వేశాఖ రిజర్వేషన్ రూల్స్లో మార్పులు చేయనుంది. వెయిటింగ్ టికెట్లలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు చార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ వెయింటింగ్ లిస్టులో ఉంటే క్యాన్సిల్ అయ్యి రీఫండ్ ఇస్తున్నారు. ఇక నుంచి అలా అవ్వదు. ఆ టికెట్పై ప్రయాణం చేయవచ్చు,.

రైళ్లల్లో వెళ్లేవారు ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తారు. దీని వల్ల సీటు రిజర్వ్ చేసి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్ని రోజుల ముందుగానే టికెట్ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సీటు అనేది లభిస్తుంది. అయితే రైల్వే టిక్కెట్ల బుకింగ్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అదేంటంటే.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెయిటింగ్ టిక్కెట్లపై ఉన్న ఆటో రద్దు నిబంధనను తొలగించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రస్తుతం చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయి. రైల్వేశాఖ రీఫండ్ను ప్రయాణికులకు వెంటనే అందిస్తుంది. ఈ రూల్లో ఇప్పుడు మార్పులు జరగనున్నాయి. చార్ట్ తయారైన తర్వాత కూడా వెయిటింగ్లో ఉన్న ఆన్లైన్ టిక్కెట్లు చెల్లుబాటులో ఉండేలా నిబంధనలను మార్చుతున్నారు. ప్రయాణికులను ఈ టికెట్లను ఉపయోగించి జనరల్ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే వీలు కల్పించనున్నారు.
వెయిటింగ్ లిస్ట్ టికెట్ రద్దు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ చార్ట్ ప్రిపేర్ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాన్సిల్ చేస్తుంది. పన్నులు, ఇతర ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రయాణికుల అకౌంట్కు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది. కానీ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుండి టికెట్ తీసుకున్నవారు వెయిటింగ్ టిక్కెట్లపై జనరల్ కంపార్ట్మెంట్లలో ప్రయాణించడానికి ఇప్పటివరకు వీలుంది. ఇక నుంచి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి కూడా ఈ అవకాశం అందుబాటులోకి తీసుకురానున్నారు.
జనరల్ టికెట్ తీసుకోకుండానే..
ట్రైన్లలో ప్రయాణించేవారిలో దాదాపు 85 శాతం మంది ఆన్లైన్లోనే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. వెయిటింగ్ లిస్టు టికెట్ క్యాన్సిల్ అయితే తమ తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం లేదా జనరల్ టిక్కెట్లను కొనుగోలు చేసి వెళ్లడం లాంటివి ప్రస్తుతం చేయాల్సి వస్తోంది. కానీ ఇక నుంచి ప్రత్యేకంగా జనరల్ టికెట్ తీసుకోకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్పై ప్రయాణం చేయవచ్చు. ఇది ప్రయాణికులకు కాస్త ప్రయోజనం కలిగించే అంశమని చెప్పవచ్చు. రైల్వేశాఖ వచ్చే నెలలో కొత్త ఐఆర్సీటీసీ వెబ్ సైట్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సిస్టమ్లో మార్పులు జరగనున్నాయి. వెయిటింగ్ లిస్టు టికెట్లు ఆటోమేటిక్గా క్యాన్సిల్ కాకుండా సిస్టమ్లో మార్పులు చేయనున్నారు. ఆన్లైన్లో ఎక్కువమంది టికెట్లను బుక్ చేసుకుంటుండటంతో.. వారికి ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకుంది.
