గ్లోబల్ టాప్-500 నుంచి భారతీయ కంపెనీలు అవుట్! కారణం ఏంటంటే..?
భారత బ్లూ-చిప్ కంపెనీలు గ్లోబల్ టాప్ 500 జాబితాలో గణనీయంగా తగ్గుతున్నాయి. 2024లో 18 నుండి 2026 నాటికి 11 కి పడిపోయింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ దీనికి ప్రధాన కారణాలు.

ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్కు ప్రతిష్టను తీసుకువచ్చిన బ్లూ-చిప్ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వేదికపై తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాయి. తాజా గణాంకాలు చూస్తే ప్రపంచంలోని టాప్-500 అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారత కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024 సెప్టెంబర్లో 18 కంపెనీలు ఉన్న చోట, 2026 నాటికి ఈ సంఖ్య కేవలం 11కి పడిపోవడం మార్కెట్ బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ క్షీణతలో భాగంగా ITC, HCL టెక్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు జాబితా నుంచి తప్పుకున్నాయి. అంతకుముందు NTPC, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ కూడా ఈ జాబితా నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం మిగిలిన కంపెనీలలో కూడా SBI, భారతీ ఎయిర్టెల్ వంటి సంస్థల ర్యాంకులు కూడా పడిపోయాయి.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం గ్లోబల్, దేశీయ అంశాల కలయిక. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. అదే సమయంలో ముడి చమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని తెచ్చింది. భారతదేశం తన చమురు అవసరాల్లో 85-90 శాతం దిగుమతులపై ఆధారపడటం వల్ల, ధరల పెరుగుదల నేరుగా మార్కెట్ భావోద్వేగాన్ని దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడిదారుల వైఖరి కూడా కీలక పాత్ర పోషించింది. అధిక విలువలు, ఆశించిన స్థాయిలో లాభాల వృద్ధి లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. ఫలితంగా 2026లో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా గణనీయంగా నష్టపోయాయి.
ప్రపంచ స్థాయిలో చూస్తే, అమెరికా కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ప్రపంచ టాప్-500 జాబితాలో సగానికి పైగా కంపెనీలు అమెరికాకు చెందినవే. Nvidia, యాపిల్, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాలు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత కంపెనీలు గ్లోబల్ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, దీన్ని తాత్కాలిక దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ అనిశ్చితులు తగ్గి, పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పెరిగితే, భారత మార్కెట్లు తిరిగి బలపడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
