Income Tax: దేశంలో ఈ లావాదేవీలన్నీ ట్యాక్స్ ఫ్రీ.. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు..
ఏ దేశంలోని అయినా ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలోనే కూడా అదే రూల్ ఉంది. ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ట్యాక్స్ చెల్లింపుల నుంచి కొన్నిటికి మినహాయింపులు ఇచ్చారు.

ఎక్కువ జీతం పొందేవారు, పెద్ద వ్యాపారాలు, ఇతర పనులు చేస్తే పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించేవారు తాము సంపాదించే ఆదాయంపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ ట్యాక్స్ ఎంత కట్టాలి అనేది శ్లాబుల ప్రకారం ఉంటుంది. మీ ఆదాయానికి తగ్గట్లు ఈ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనంతంర మీ ఖర్చులు చూపించి కొంతమొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పొందే అవకాశముంటుంది. కానీ దేశంలో కొన్నింటికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. కొన్ని లావాదేవీలు, ఆస్తులు, ఆదాయంపై జీరో ట్యాక్స్ అమల్లో ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వ్యవసాయంపై వచ్చే ఆదాయం
వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ భూమి నుంచి వచ్చే అద్దె, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ఇతర వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయానికి ఎలాంటి పన్ను లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(1) ప్రకారం ఇలాంటి లావాదేవీలకు పన్ను మినహాయింపు ప్రభుత్వం కల్పించింది. వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వారసత్వం ద్వారా వచ్చే ఆస్తులు
ఇక ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారసులకు అందే ఆస్తులు పన్ను పరిధిలోకి రావు. ఆస్తి బదిలీ, వీలునామా, వారస్వతం ద్వారా వచ్చే ఆస్తులకు పన్ను విధించరు. అలాగే బహుమతి రూపంలో ఆస్తి వచ్చినా పన్ను మినహాయింపు ఉంది. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక బంధువులు, కుటుంబసభ్యుల నుంచి వచ్చే బహుమతులకు పన్ను ఉండదు. ఇక వివాహం, పంక్షన్ల సమయంలో ఇచ్చే బహుమతులకు కూడా ట్యాక్స్ ఉండదు. అయతే బంధువు కాని వ్యక్తి నుంచి నగదు, స్థిరాస్తి, చరాస్తి రూపంలో బహుమతిగా స్వీకరిస్తే పన్ను పరిధిలోకి వస్తుంది.
వీటికి కూడా నో ట్యాక్స్
సుకన్య సమృద్ది యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, స్వచ్చంధ భవిష్య నిధి, ఈపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ స్కీమ్ లాంటి ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్తో పాటు జీవిత బీమా మెచ్యూరిటీ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు. మెచ్యూరిటీకి ముందే ఈ పథకాల్లో డబ్బును విత్ డ్రా చేసుకుంటే కొంత పన్ను ఉంటుంది. అదే మెచ్యూరిటీ తర్వాత చేసే విత్ డ్రాలకు ఎలాంటి పన్ను అనేది ఉండదు. ఇలా దేశంలో చాలా లావాదేవీలు పన్ను రహితంగా ఉన్నాయి. అలాగే స్వచ్చంధ సంస్థలకు ఇచ్చే విరాళాలకు కూడా పన్ను మినహాయింపు ఉంది.
