AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: వాట్సప్, టెలిగ్రాంలో ఇలాంటి మెస్సేజ్‌లు వస్తున్నాయా..? డేంజర్‌లో పడ్డట్లే.. కేంద్రం హెచ్చరిక

స్టాక్ మార్కెట్ పెట్టుబడి టిప్స్ పేరుతో వాట్సప్, టెలిగ్రాంలో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా..? మీరు వీఐపీ స్టాక్ మార్కెట్ టిప్స్ వంటి గ్రూపుల్లో చేరుతున్నారా..? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే. నకిలీ అప్లికేషన్లను మీతో డౌన్ లోడ్ చేయించి మీ అకౌంట్లలోని డబ్బులు కాజేయవచ్చు.

Central Government: వాట్సప్, టెలిగ్రాంలో ఇలాంటి మెస్సేజ్‌లు వస్తున్నాయా..? డేంజర్‌లో పడ్డట్లే.. కేంద్రం హెచ్చరిక
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Jul 07, 2026 | 4:14 PM

Share

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాట్సప్, టెలిగ్రాం లాంటి సోషల్ మెస్సేజింగ్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలతో అమాయక పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మోసగాళ్లు నకిలీ పెట్టుబడి గ్రూపులు సృష్టించి మార్కెట్ నిపుణులు లేదా ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థల ప్రతినిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. వీఐపీ స్టాక్ టిప్స్ పేరుతో కల్పిత ట్రేడింగ్ సలహాలు ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు తెలిపింది.

అధికారిక యాప్స్ మాత్రమే ఉపయోగించండి..

అధికారిక యాప్ స్టోర్‌లకు బదులుగా ప్రైవేట్ లింక్‌ల ద్వారా ట్రేడింగ్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయిస్తారని, దీని ద్వారా మీ డేటాను సేకరించి ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ విభాగం వివరించింది. దీంతో తెలియని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో పంచుకునే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని ప్రజలను హెచ్చరించింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేముందు బ్రోకర్లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల విశ్వసనీయతను సరిచూసుకోవాలని సూచించింది. మొదట మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నకిలీ లాభాలను చూపిస్తారని, ఆ తర్వాత డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు, ధృవీకరణ ఛార్జీల పేరుతో అదనపు మొత్తాలను జమ చేయమని అడుగుతారని తెలిపింది. నిజమైన స్టాక్ బ్రోకర్లు లేదా ఆర్థిక సంస్థలు కస్టమర్ల వద్ద ఉన్న నిధులను విడుదల చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి అదనపు డబ్బు డిపాజిట్ చేయమని ఎప్పుడూ అడగవని సైబర్ డిపార్ట్‌మెంట్ వివరించింది.

ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి

పెట్టుబడిదారులు ట్రేడింగ్ అప్లికేషన్లను అధికారిక యాప్ స్టోర్‌ల నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ విభాగం సూచించింది. అవాంఛిత సందేశాలు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని తెలిపింది. వినియోగదారులు పెట్టుబడి పెట్టే ముందు తగిన శ్రద్ధ వహించాలని, ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్ధిక సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలియని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో పంచుకునే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని సూచించింది. సైబర్ మోసాల బారిన పడితే 1930కు డయల్ చేసి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా cybercrime.gov.inపోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

Follow Us