Gold Price: బంగారం ధరలు పరుగులు.. కారణం చెప్పేసిన నిర్మలా సీతారామన్.. రీజన్ ఏంటంటే..?
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల క్రమంలో పసిడి ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగడంపై కేంద్రం ఆర్దికశాఖ మంత్రి నిర్మతా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే వార్తల క్రమంలో పసిడి ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. సోమవారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ క్రమంలో బంగారం ధరలపై పెరుగుదలపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
కారణం చెప్పిన నిర్మలమ్మ
బంగారం ధరలు పెరగడానికి నిర్మలా సీతారామన్ కారణం చెప్పేశారు. కేంద్ర బ్యాంకులు గోల్డ్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపారు. ఆర్ధిక వ్యవస్థ స్ధిరంగా ఉంచుకునేందుకు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీని కారణంగానే పెరుగుతున్నట్లు ఆమె తెలిపారు. అలాగే పండుగ సమయాలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలిపారు. అటు పసిడి ధరల పెరుగుదలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, ఆర్బీఐ కూడా పర్యవేక్షిస్తోందని తెలిపారు. బంగారం దిగుమతులు ఆందోళకర స్థాయిలో లేవని, ఆర్బీఐ నిరంతరం పరిశీలిస్తోందని అన్నారు. కరెంట్ ఖాతా లోటు నిర్వహించదగ్గ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. కొన్ని పరిమితుల్ని అధిగమించినట్లేనని పేర్కొన్నారు.
రూ.2 వేలు పెరిగిన బంగారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పలు దేశాలపై 15 శాతం సుంకాలు విధించారు. దీని వల్ల బంగారం రేట్లపై ప్రభావితం చూపిస్తున్నాయి. అటు హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,350 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.2 వేలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,900 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.1900 మేర పెరిగింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో రూ.1.62 లక్షల వద్ద బంగారం కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు పెరగడం కొనుగోలుదారులకు పెద్ద భారంగా మారింది. పెళ్లిళ్ల సమయంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వధూవరులు కానుకగా ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. అటు వెండి ధరలు ఒకేసారి రూ.10 వేలు పెరిగాయి. నిన్న రూ.2.90 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.3 లక్షల మార్క్కు చేరుకున్నాయి.
