Gold Sales: కర్వా చౌత్ రోజున అరుదైన రికార్డు.. ఒక్కరోజే రూ. 3000 కోట్ల పసిడి, వెండి ఆభరణాల అమ్మకం..
అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ కర్వా చౌత్లో బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు దాదాపు 36 శాతం పెరిగాయని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.
భారతీయులు పసిడి ప్రియులు.. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు ఇలా ఏ సమయం వచ్చినా బంగారం కొనుగోలుకు ఆసక్తినిస్తారు. అయితే కోవిడ్ మానవజీవితాలపై అత్యంత ప్రభావం చూపింది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో అనేక రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పారిశ్రామిక, ఆర్ధిక, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. అనేక కార్యక్రమాలు మందగించాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ కర్వా చౌత్లో బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు దాదాపు 36 శాతం పెరిగాయని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన బంగారు, వెండి ఆభరణాల విక్రయాలు ఏడాది రూ. 2,200 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ. 3,000 కోట్ల మేర జరిగినట్లు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT), అఖిల భారత జ్యువెల్లర్స్, గోల్డ్స్మిత్ ఫెడరేషన్ (AIJGF) గురువారం సంయుక్తంగా ప్రకటించాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000 , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,000 ఉంది. ఇక వెండి కిలో రూ. 59,000గా ఉందని రెండు సంఘాలు పేర్కొన్నాయి. “వ్యాపార దృక్కోణంలో చూస్తే.. దేశవ్యాప్తంగా బంగారం, వెండి వ్యాపారులకు అక్టోబర్, నవంబర్ నెలలు చాలా శుభప్రదంగా పరిగణించబడతాయి. కర్వా చౌత్ తర్వాత, పుష్య నక్షత్రం, ధన్ తేరాస్, లక్ష్మీ పూజ, దీపావళి, అన్నచెల్లెల పండగ, తులసి వివాహం వంటి అనేక పండగలను చాలా ఉత్సాహంగా జరుపుకుంటార, ”అని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్, AIJGF జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఫ్యాషన్ జ్యువెలరీ, సాంప్రదాయ బంగారు నగలు, వెండి ఆభరణాలు కూడా భారీ స్థాయిలో సామాన్యులు కొనుగోలు చేశారని ప్రవీణ్ ఖండేల్వాల్, పంకజ్ అరోరా చెప్పారు. లైట్ వెయిట్ జ్యువెలరీ భారీ స్టాక్ కూడా ఉందని చెప్పారు.
ముఖ్యంగా ఈ ఏడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బంగారు ఆభరణాల రిటైలర్లకు రాబడి ప్లాట్ గా ఉంటుందని తెలుస్తోంది. పెంచిన దిగుమతి సుంకాన్ని వ్యాపారులు కస్టమర్లపై మోపుతారని పేర్కొంది. “గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మహమ్మారి-నేతృత్వంలోని అంతరాయాలు తగ్గిన తరువాత డిమాండ్ కొంతమేర తగ్గింది. 5 శాతం దిగుమతి సుంకం తగ్గింపు ఫిబ్రవరి 2021లో అమలులోకి వచ్చింది, ఇది ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొనసాగింది. ” అని ఏజెన్సీ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..