AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధ భయం.. గోల్డ్ ఫండ్లకు పెరుగుతున్న డిమాండ్! లాభాలు చూస్తే వావ్‌ అనాల్సిందే!

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితంగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పటికీ, బంగారం ధరలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, ETF లు గత ఏడాది గణనీయమైన రాబడులను అందించాయి.

యుద్ధ భయం.. గోల్డ్ ఫండ్లకు పెరుగుతున్న డిమాండ్! లాభాలు చూస్తే వావ్‌ అనాల్సిందే!
Gold 2
SN Pasha
|

Updated on: Mar 19, 2026 | 4:15 AM

Share

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తున్న వేళ, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా బంగారం ఆధారిత పెట్టుబడులు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు గత నెలలో 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయినప్పటికీ, బంగారం ధరలు మాత్రం అదే సమయంలో సుమారు 5 శాతం పెరిగాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు పెరిగింది.

గత ఏడాది నుంచే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు బలమైన రాబడులను అందిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. నిప్పొన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహిస్తున్న గోల్డ్ సేవింగ్స్ ఫండ్ సుమారు 84.66 శాతం రాబడిని అందించగా, గోల్డ్ ETF BeES కూడా దాదాపు అదే స్థాయిలో లాభాలను ఇచ్చింది. అదేవిధంగా యాక్సిక్‌, ఐసీఐసీ ప్రొడన్షియల్‌, HDFC, టాటా మ్యూచువల్‌ ఫండ్‌ వంటి సంస్థల గోల్డ్ ఫండ్లు కూడా మంచి పనితీరును కనబరిచాయి. అయితే ఈ అధిక రాబడుల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ప్రారంభించడంతో ఫిబ్రవరిలో నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) తాత్కాలికంగా తగ్గాయి. అయినప్పటికీ మొత్తం దృష్టిలో చూస్తే గోల్డ్ ETFలలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026 నాటికి గోల్డ్ ETFల AUM రూ.1.83 లక్షల కోట్లకు చేరుకుని, గత ఏడాదితో పోలిస్తే 165 శాతం పెరుగుదల నమోదైంది.

ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం ధరలు సాధారణంగా ఈక్విటీ మార్కెట్లకు వ్యతిరేక దిశలో కదులుతాయి. స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల, బంగారం ధరలు పెరుగుతాయి. ఈ లక్షణం కారణంగా బంగారం పోర్ట్‌ఫోలియోలో రిస్క్ తగ్గించే సాధనంగా (హెడ్జ్) పనిచేస్తుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు స్థిరత్వాన్ని కోరుకుంటూ గోల్డ్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ అస్థిరత కొనసాగుతున్నంత వరకు ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us