పీఎఫ్ ఉద్యోగులకు 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..? ఈ లెక్కలు తెలుసుకోండి..
మీరు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా? అయితే రిటైర్మెంట్ తర్వాత మీకు వచ్చే పెన్షన్ గురించిన ఈ కీలక నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నియమాల ప్రకారం.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశం ఉంది. మరి ఒక ఉద్యోగి 10 ఏళ్ల పాటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తే అతనికి ఎంత పెన్షన్ వస్తుంది? అనేది తెలుసుకుందాం..

జాబ్ చేసేవారికి ఖచ్చితంగా పీఎఫ్ ఉంటుంది. ఆపదసమయాల్లో ఆదుకునే బంగారు నిధి పీఎఫ్. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఇప్పటికీ చాలా మందికి పీఎఫ్ గురించి అన్నీ విషయాలు పూర్తిగా తెలియవు. చాలామందికి పీఎఫ్ డబ్బులు ఎలా వస్తాయో తెలుసు కానీ, పెన్షన్ ఎలా వస్తుంది? ఎన్ని ఏళ్లు సర్వీస్ ఉండాలి? అనే విషయాలపై స్పష్టత ఉండదు. ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీలో 10 ఏళ్లు పూర్తి చేసుకుంటే మీకు ఎంత పెన్షన్ వస్తుంది? దాని నిబంధనలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యంజ
పెన్షన్ రావాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి..
ఉద్యోగుల పింఛను పథకం కింద నెలవారీ పెన్షన్ పొందాలంటే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఉద్యోగి ప్రైవేట్ రంగంలో కనీసం 10 సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అంటే సదరు వ్యక్తి వరుసగా లేదా విడతల వారీగా 10 ఏళ్ల పాటు తన పీఎఫ్ ఖాతాకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి.
ఒకే కంపెనీలో పనిచేయాలా?
చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే.. ఈ 10 ఏళ్లు ఒకే కంపెనీలో పనిచేయాలా? అని. అస్సలు అవసరం లేదు. మీరు మీ కెరీర్లో ఎన్ని కంపెనీలు మారినా నష్టం లేదు. కానీ మీరు పనిచేసిన మొత్తం కాలం 10 సంవత్సరాలు నిండి, ఆ సమయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్కు మీ తరపున కంట్రిబ్యూషన్ జరిగి ఉంటే చాలు.. మీరు పెన్షన్కు అర్హులవుతారు.
ఈపీఎస్ ఫండ్ ఎలా పనిచేస్తుంది?
ఉద్యోగి జీతం నుండి పీఎఫ్ కింద కట్ అయ్యే మొత్తంలో.. కంపెనీ యాజమాన్యం ఇచ్చే వాటాలోని ఒక నిర్దిష్ట భాగం EPS ఖాతాకు వెళ్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల పాటు జమ అయిన డబ్బును, ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెలా ఒక స్థిరమైన పెన్షన్ రూపంలో ఈపీఎఫ్ఓ చెల్లిస్తుంది.
10 ఏళ్ల సర్వీస్కు ఎంత పెన్షన్ వస్తుంది?
ఒక ఉద్యోగి ప్రైవేట్ కంపెనీల్లో మొత్తంగా 10 సంవత్సరాలు పనిచేసి, అతని సగటు పదవీ విరమణ జీతం రూ.15,000 గా ఉంటే, అతనికి ఈ క్రింది విధంగా పెన్షన్ లభిస్తుంది:
నెలవారీ పెన్షన్: సుమారు రూ. 2,143
ఏ వయస్సు నుండి వస్తుంది?: ఉద్యోగులకు 58 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఈ రూ. 2,143 మొత్తాన్ని ప్రతి నెలా పింఛనుగా చెల్లిస్తారు. అయితే ఉద్యోగి సర్వీస్ కాలం, వారి సగటు జీతం పెరిగే కొద్దీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు తమ పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవడం ద్వారా తమ సర్వీస్ కాలాన్ని కోల్పోకుండా చూసుకోవచ్చు.
