EPFO: ఈపీఎఫ్వో కొత్త రూల్స్.. ఖాతాదారులకు మరో అప్డేట్.. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ జమ కాదా..?
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల ఈపీఎఫ్వో వడ్డీ రేటును నిర్ణయించింది. త్వరలో వడ్డీ ఖాతాల్లో జమ కానుంది. అయితే ఎవరెవరికి వడ్డీ జమ అవుతుంది.. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ జమ అవుతుందా అనే విషయాలు చూద్దాం.

ఈపీఎఫ్వో అనేది దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు పథకం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఖాతాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఉద్యోగి జీతంలో కొంత మొత్తం కట్ చేసి ఈ ఖాతాలో జమ చేస్తారు. ఇక దీనికి సమానమైన సొమ్మును యాజమాన్యం దాఖలు చేస్తోంది. అంతేకాక ఈపీఎఫ్వో అకౌంట్లోని బ్యాలెన్స్పై కేంద్రం ప్రతీ ఏడాది వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం ఉంది. ఇక పీఎఫ్ ఖాతా ఉన్నవారికి పెన్షన్, జీవిత బీమా వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
అకౌంట్ ఇనాక్టివ్ ఎప్పుడు అవుతుంది..?
మీ పీఎఫ్ నిబంధనల ప్రకారం.. అకౌంట్లో వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి వాటా అందకపోతే ఆటోమేటిక్గా ఇనాక్టివ్ అయిపోతుంది. ఇక 55 ఏళ్లు నిండిన వ్యక్తి అకౌంట్ మూడు ఏళ్ల తర్వాత ఇనాక్టివ్ అవుతుంది. ఇక ఖాతాదారుడు ముందే పదవీ విరమణ చేస్తే.. పదవి విరమణ తేదీ నుంచి మూడేళ్ల తర్వాత అకౌంట్ ఇనాక్టివ్గా మారుతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ అవ్వదు.
వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది..?
55 ఏళ్ల వయస్సు రాకముందే పదవీ విరమణ చేస్తే.. 58 ఏళ్లు వచ్చేంతవరకు వడ్డీ జమ అవుతుంది. ఇక 60 ఏళ్ల వయస్సుల్లో పదవి విరమణ చేస్తే.. తదుపరి 3 ఏళ్ల పాటు వడ్డీ పొందవచ్చు. ఇక ఇటీవల ఇనాక్టివ్ అకౌంట్లలో మిగిలిపోయిన రూ.వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ సొమ్మును ఆటోమేటిక్గా లబ్దిదారుడి జాబితాలో జమ చేయాలని ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయని బ్యాలెన్స్ను వారి ఖాతాల్లో ఆటోమేషన్ పద్దతిలో వేయనుంది. పైలట్ ప్రాజెక్ట్గా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎంత..?
2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్వో వడ్డీ రేటును 8.25 శాతంగా సిఫార్సు చేశారు. కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదానికి దీనిని పంపారు. ఆర్ధికశాఖ ఆమోదం తెలిపాక చందాదారులకు వడ్డీ జమ చేయనున్నారు. 2024-25లో పటిష్టమైన ఆర్ధిక పనితీరును ఈపీఎఫ్వో నమోదు చేసింది. మొత్తం చందాలు రూ.3,35,628.21 కోట్లకు చేరాయి. 2,86,897 కొత్త సంస్థలు పీఎఫ్ పరిధిలోకి వచ్చాయి. 1,22,89,244 మంది కొత్త సభ్యులు చేరారు. 81,48,490 మంది పెన్షనర్లకు సేవలు అందించగా. 69,983 ఈడీఎల్ఐ క్లెయిమ్ జరిగాయి. మొత్తం 6,01,59,608 క్లెయిమ్స్ను పరిష్కరించారు. మరోవైపు ఈ ఏడాది 17,33,046 ఫిర్యాదులను పరిష్కరించగా.. 39,74,501 కాల్స్కు స్పందించారు.
