తండ్రి పెన్షన్ డబ్బుపై విడాకులు పొందిన కూతురికి హక్కు ఉంటుందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం విడాకులు తీసుకున్న కుమార్తెకు కుటుంబ పింఛనుపై హక్కు ఉంటుంది. CCS (పెన్షన్) నియమాలు, 2021 ప్రకారం, అవివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె, నెలకు రూ.9,000 కంటే తక్కువ ఆదాయంతో జీవనోపాధి లేని పక్షంలో అర్హురాలు.

ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ పింఛను ఆధారిత కుటుంబ సభ్యులకు కీలక ఆర్థిక సహాయంగా మారుతుంది. అయితే విడాకులు తీసుకున్న కుమార్తెకు తండ్రి కుటుంబ పింఛనుపై హక్కు ఉంటుందా అనే సందేహం చాలామందిలో ఉంది. కేంద్ర ప్రభుత్వ CCS (పెన్షన్) నియమాలు, 2021 ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పింఛనుకు అర్హత పొందవచ్చు. నియమం 50(9) ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కుమార్తె అవివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్నదై ఉండాలి. ఆమె జీవనోపాధి సంపాదించకపోతే, 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా కుటుంబ పింఛను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆమె పునర్వివాహం చేసుకునే వరకు లేదా ఆదాయం సంపాదించడం ప్రారంభించే వరకు మాత్రమే ఈ పింఛను కొనసాగుతుంది.
నెలకు రూ.9,000తో పాటు డియర్నెస్ అలవెన్స్ కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే తల్లిదండ్రులు జీవించి ఉండగానే విడాకుల ప్రక్రియ ప్రారంభమై ఉండాలి లేదా విడాకులు పూర్తయ్యి ఉండాలి. కొన్ని సందర్భాల్లో తండ్రి మరణానంతరం విడాకులు ఖరారైనా, ముందుగానే విడిపోవడం లేదా కోర్టు కేసు నడుస్తున్నట్లు రుజువులు ఉంటే పింఛనుకు అర్హత లభించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల్లో తండ్రిపై ఆర్థికంగా ఆధారపడినట్లు నిరూపించగలిగితే విడాకులు ఆలస్యంగా ఖరారైనప్పటికీ పింఛనుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే త్రిపుర హై కోర్టు కొన్ని కేసుల్లో తండ్రి మరణం తర్వాతే విడాకులు జరిగితే అర్హత నిరాకరించింది. అందువల్ల ప్రతి కేసు పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
కుటుంబ పింఛనులో మొదటి హక్కు భార్యకు లేదా భర్తకు ఉంటుంది. వారు మరణించిన తర్వాత లేదా అనర్హులైన తర్వాతే పిల్లలకు హక్కు వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ అర్హులైన కుమార్తెలు ఉంటే, పుట్టిన క్రమం ప్రకారం పింఛను అందజేస్తారు. పింఛనుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విడాకుల డిక్రీ, మరణ ధృవీకరణ పత్రం, ఆదాయ అఫిడవిట్, ఆధార్, బ్యాంక్ వివరాలు, ఆధారపడినట్లు రుజువులు, PPO వివరాలు వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం జీవిత ధృవీకరణ పత్రం కూడా సమర్పించడం తప్పనిసరి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
