AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం దిగుమతులు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమా? నిపుణులు ఏమంటున్నారంటే?

భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనవసర కొనుగోళ్లు వాయిదా వేయాలని కోరారు. ఇది దేశ విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటు పై ఒత్తిడి పెంచుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగారం దిగుమతులు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమా? నిపుణులు ఏమంటున్నారంటే?
Gold Imports
SN Pasha
|

Updated on: May 12, 2026 | 3:26 PM

Share

భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరం లేని బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం దిగుమతులు వేగంగా పెరుగుతుండటం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు, వాణిజ్య లోటుపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాల ప్రకారం 2025-26లో భారతదేశ బంగారం దిగుమతులు 24 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఇది 2024-25లో 58 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఐదేళ్లలో దాదాపు రెట్టింపు పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు పెరగడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా మారింది. 2024-25లో కిలో బంగారం ధర 76,617 డాలర్లుగా ఉండగా, 2025-26లో అది 99,825 డాలర్లకు చేరింది. భారత్ ప్రస్తుతం చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. దేశంలో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం ఆభరణాల పరిశ్రమకు వెళ్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల డిమాండ్ మరింత పెరుగుతోంది. అయితే ఈ పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. 2025-26లో భారత వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు చేరగా, కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరిగింది. RBI ప్రకారం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో CAD 13.2 బిలియన్ డాలర్లకు చేరింది.

భారత్‌కు బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ ప్రధాన వనరుగా ఉండగా, తర్వాత UAE, సౌతాఫ్రికా ఉన్నాయి. ముఖ్యంగా UAE నుంచి దిగుమతులు వేగంగా పెరగడం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై ఆంక్షలు కఠినతరం చేస్తోంది. నిపుణులు కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద ఇస్తున్న రాయితీలను పునఃసమీక్షించాలని సూచిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో బంగారం దిగుమతుల నియంత్రణపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us