Central Government: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్..
విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 60 శాతం సీట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని సూచించింది. విమానంలో డోర్ పక్కన సీట్లకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక వెనక సీట్లకు తక్కువ వసూలు చేస్తున్నారు.

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించింది. విమానంలో ఎంపిక చేసిన కొన్ని సీట్లకు అధిక ఛార్జీలను వసూలు చేస్తుండటంపై విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వీటికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. ఏ విమానంలోనైనా కనీసం 60 శాతం సీట్లుకు ఎంపిక రుసుములు వసూలు చేయవద్దని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆదేశించింది. సీట్లను ఎంపిక చేసుకునే సమయంలో అధిక ఛార్జీలను వసూలు చేస్తూ విమానయాన సంస్థలు వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. సీటు ఛార్జీలపై అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అదనపు ఛార్జీలపై విమర్శలు
ప్రస్తుతం విమానంలోని సీట్లకు వాటి స్థానాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. కిటికీ పక్క, నడవ పక్క సీట్లకు, ఎక్కువ లెగ్రూమ్ ఉన్న సీట్లకు అధిక ఛార్జీలను విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నాయి. విమానంలో చాలా తక్కువ సీట్లకు మాత్రమే అదనపు ఛార్జీలు ఉండటం లేదు. మధ్య వరుసలో, వెనుక భాగంలో ఉన్న సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవు. అయితే దీనిపై సోషల్ మీడియాలో ప్రయాణికులు అనేక విమర్శలు చేస్తున్నాయి. సీటు కోసం అదనంగా ఎందుకు చెల్లించాలంటూ సోషల్ మీడియాలో వినియోగదారులు పదేపదే ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టింది. ఒకే PNRపై ప్రయాణించే ప్రయాణికులను ఒకేచోట, వీలైతే పక్కపక్క సీట్లలో కూర్చోబెట్టాలని విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ సూచించింది.
కేంద్రం కీలక ఆదేశాలు
విమాన ప్రయాణంలో కుటుంబసభ్యులందరూ కలిసి ఒకేచోట ప్రయాణం చేయాలనుకుంటారు. కొన్నిసార్లు వేర్వేరు చోట్ల సీట్లు లభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తోటి ప్రయాణికులను ఇతర సీట్లకు మారమని అభ్యర్థిస్తున్నారు. కొందరు నిరాకరించడంతో.. విమాన ప్రయాణంలో తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒకేచోట సీట్లు కేటాయించాలని కేంద్రం సూచించింది. అలాగే ఆలస్యం, రద్దు, బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాలలో ప్రయాణీకుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ సమయంలో ప్రయాణికులకు ఉండే హక్కులను తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, బుకింగ్ ప్లాట్ఫారమ్లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రముఖంగా ప్రదర్శించాలని విమానయాన సంస్థలను కోరింది. క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాకు సంబంధించి స్పష్టమైన, పారదర్శకమైన విధానాలను అవలంబించాలని కోరింది. అస్థిరమైన నిబంధనలు, అధిక ఛార్జీలపై ప్రయాణికుల నుండి తరచుగా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించింది.
