
ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తిగత అవసరాలు, అత్యవసర పరిస్థితుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఇల్లు కొనడానికి గృహ రుణం తీసుకుంటారు. కొందరు తమకు నచ్చిన కారు కొనడానికి కారు లోన్ తీసుకుంటారు. మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకులు లోన్ మాఫీ చేస్తాయా? లేదా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తాయా? అనేది తెలుసుకుందాం..
గృహ రుణం తీసుకుని రుణగ్రహీత అకస్మాత్తుగా మరణిస్తే బ్యాంకు సహ రుణగ్రహీత, హామీదారుడిని సంప్రదిస్తుంది. వారిద్దరూ చేతులు ఎత్తితే, అటువంటి పరిస్థితిలో బ్యాంకు ఆ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంది. కానీ ఈ ప్రక్రియ వెంటనే జరగదు. రుణగ్రహీత కుటుంబానికి నోటీసు పంపి రుణం తిరిగి చెల్లించమని సూచించిన తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోతే ఈ చర్య తీసుకుంటారు. అయితే ఆస్తికి బీమా ఉంటే గృహ రుణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కార్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్. కార్ లోన్ తీసుకుని రుణగ్రహీత మరణిస్తే బ్యాంకు కుటుంబ సభ్యులను సంప్రదించి రుణం తిరిగి చెల్లించమని అడుగుతుంది. మిగిలిన మొత్తం అందకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకుని వేలం వేస్తారు. ఏదైనా తేడా ఉంటే, బ్యాంకులు సంబంధిత కుటుంబం నుండి దానిని డిమాండ్ చేస్తాయి. వాహన రుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
వ్యక్తిగత రుణాలు అన్సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కిందకు వస్తాయి. అటువంటి రుణాలలో బ్యాంకు వద్ద ఎటువంటి పూచీకత్తు ఉండదు. వ్యక్తిగత రుణం తీసుకొని రుణగ్రహీత మరణిస్తే బ్యాంకు మొదట సహ-రుణగ్రహీత, హామీదారుని సంప్రదిస్తుంది. ఇద్దరూ చేతులు ఎత్తితే. బ్యాంకులు ఈ కుటుంబాన్ని సంప్రదిస్తాయి. దాని నుండి ఎటువంటి ప్రయోజనం లేకపోతే, బ్యాంకులు ఆ వ్యక్తి వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకుని దాని నుండి తిరిగి పొందుతాయి. కానీ రుణగ్రహీతకు ఎటువంటి ఆస్తి లేకపోతే, అటువంటి రుణాన్ని నిరర్థక ఆస్తి (NPA)గా పరిగణిస్తారు. అటువంటి రుణం తిరిగి రాదు. ఇది బ్యాంకుకు ఒక రకమైన నష్టం. అయితే చాలా వరకు లోన్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చేలా.. దాన్ని లోన్ అమౌంట్తో భర్తీ చేసేలా కూడా బ్యాంకులు లోన్ ఇచ్చే ముందే ప్రీమియం కట్టిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి