ఆయుష్మాన్ కార్డుతో ఏ ఆస్పత్రుల్లో వైద్యం పొందొచ్చు? లిస్ట్ చూసుకొని వెళ్లండి!
ఆయుష్మాన్ భారత్ (PM-JAY) పథకం వైద్య ఖర్చుల నుండి రక్షణ కల్పిస్తుంది, వార్షికంగా రూ. 5 లక్షల ఉచిత వైద్య చికిత్స అందిస్తుంది. అయితే, ఈ పథకం ప్రభుత్వం గుర్తించిన ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో మాత్రమే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా కాకుండా ఆస్పత్రుల లిస్ట్ ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చులు కుటుంబాలపై భారీ భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం భరోసాగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందే అవకాశం ఉంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ఆర్థిక రక్షణ కవచంగా మారింది. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడంలో ఒక ప్రధాన సమస్య ఏమిటంటే, అన్ని ఆసుపత్రుల్లో ఈ కార్డు చెల్లుబాటు కావడం లేదు. కేవలం ప్రభుత్వం గుర్తించిన ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ విషయం ముందుగానే తెలియకపోతే అత్యవసర సమయంలో రోగిని ఒక ఆసుపత్రి నుంచి మరొకదానికి తరలించాల్సి వచ్చే ప్రమాదం ఉంది.
నిపుణుల ప్రకారం ప్రతి కుటుంబం తమ నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న PM-JAY ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల జాబితాను ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా కాకుండా, రోగికి వెంటనే సరైన చికిత్స అందించవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్గా మార్చారు. ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అధికారిక పోర్టల్లోకి వెళ్లి, రాష్ట్రం, జిల్లా, ఆసుపత్రి రకం ఆధారంగా పూర్తి జాబితాను సులభంగా తెలుసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఫైన్డ్ హాస్పిటల్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేసి, PMJAY ఎంపికను సెలెక్ట్ చేస్తే సంబంధిత ఆసుపత్రుల జాబితా వెంటనే కనిపిస్తుంది.
ఈ డిజిటల్ సదుపాయం వల్ల ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా పారదర్శకంగా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. మొత్తంగా ఆయుష్మాన్ కార్డు ఉండటం మాత్రమే కాకుండా, దాని ఉపయోగాన్ని గరిష్టంగా పొందడానికి ముందస్తు సమాచారం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
