AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8వ వేతన సంఘం.. వారికి జీతాల, పెన్షన్ల పెంపు ఉండదు? ఎందుకంటే?

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, అలవెన్సుల పెంపును తెచ్చే అవకాశం ఉంది. ప్రక్రియ వేగవంతం కాగా, అందరికీ ప్రయోజనం చేకూరదని స్పష్టమవుతోంది. కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్నవారు, ఎన్పీఎస్ పరిధిలోని పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంపునకు అర్హులు కారు.

8వ వేతన సంఘం.. వారికి జీతాల, పెన్షన్ల పెంపు ఉండదు? ఎందుకంటే?
8th Pay Commission
SN Pasha
|

Updated on: Mar 31, 2026 | 6:30 AM

Share

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 8వ వేతన సంఘం అమలు దిశగా ప్రక్రియ వేగం అందుకుంది. జీతాలు, పెన్షన్లు, అలవెన్సుల్లో మార్పులు వచ్చే అవకాశంతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి. అయితే ఈసారి ప్రతి ఉద్యోగికి లాభం చేకూరదనే విషయం స్పష్టమవుతోంది. కొన్ని వర్గాలు ఈ ప్రయోజనాల పరిధి నుంచి బయట ఉండే అవకాశం ఉంది. ఈ వేతన సంఘం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. రక్షణ, రైల్వేలు, కేంద్ర శాఖలు, అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు దీనివల్ల నేరుగా లాభపడే అవకాశం ఉంది. కొంతమంది పెన్షనర్లు కూడా ఈ పరిధిలోకి వస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలను సేకరించేందుకు కమిషన్ 18 ప్రశ్నల ప్రశ్నావళిని విడుదల చేయగా, స్పందన గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. ఈ సూచనల ఆధారంగానే తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

అయితే కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులు ఈ ప్రయోజనాలకు అర్హులు కావు. వీరు ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ, వేతన సంఘం సిఫార్సులు వీరికి వర్తించవు. అలాగే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న, సస్పెండ్ అయిన లేదా ఉద్యోగం నుండి తొలగించబడిన వ్యక్తులు కూడా ఈ పెంపు నుండి మినహాయించబడతారు. పెన్షన్ విషయంలో కూడా స్పష్టమైన తేడా ఉంది. జనవరి 1, 2004 తర్వాత సేవలో చేరిన ఉద్యోగులు నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) కిందకి వస్తారు. ఈ పథకం ప్రకారం పెన్షన్ మొత్తం మార్కెట్ పనితీరుపై ఆధారపడుతుంది. అందువల్ల పాత పెన్షన్ పథకంతో పోలిస్తే స్థిరమైన పెంపు హామీ ఉండదు.

మరో ముఖ్య అంశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులది. 8వ వేతన సంఘం సిఫార్సులు వారికి నేరుగా వర్తించవు. కొన్ని రాష్ట్రాలు తరువాత ఈ సిఫార్సులను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాష్ట్రాల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉండవచ్చు. మొత్తంగా చూస్తే 8వ వేతన సంఘం లక్షలాది కేంద్ర ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అవకాశమున్నప్పటికీ, అందరికీ సమానంగా లాభం చేకూరదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us