
2025 ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు మనం పూర్తి చేయాల్సిన కొన్ని ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. డిసెంబర్ 31 గడువుతో ఉన్న ఈ పనులను అశ్రద్ధ చేస్తే కొత్త ఏడాదిలో జరిమానాలు, వడ్డీలు, బ్యాంకింగ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కీలక పనులు ఏవో ఇప్పుడు చూద్దాం..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇప్పటివరకు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయకపోతే, మీకు డిసెంబర్ 31, 2025 వరకు ఆఖరి అవకాశం ఉంది. మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో దాఖలు చేయకపోతే మీ టాక్స్ రీఫండ్స్ నిలిచిపోతాయి. అంతేకాకుండా లోన్ అప్రూవల్స్, క్రెడిట్ స్కోర్, వీసా దరఖాస్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
అక్టోబర్ 1, 2024 లేదా అంతకు ముందు ఆధార్ పొందిన వారు తమ పాన్ కార్డుతో దానిని లింక్ చేయకపోతే ఈ నెలాఖరులోపు పూర్తి చేయడం తప్పనిసరి.
డిసెంబర్ 31లోపు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ పనిచేయకుండా అవుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు, పెట్టుబడులు, ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలులో తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్లి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ OTP ద్వారా సులభంగా లింక్ చేయవచ్చు.
రిటర్న్లు దాఖలు చేయని వారిని ఆదాయపు పన్ను శాఖ నిశితంగా గమనిస్తుంది. నిరంతరం విఫలమయ్యే వారికి నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏవైనా జరిమానాలు ఉంటే వాటిని ఆన్లైన్లో చెల్లించి, ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి