రెండు వారాలు ఇంతే.. వలస కార్మికులకు కేటీఆర్ వార్నింగ్
మరో రెండు వారాలు ఇలా లాక్ డౌన్లో వుండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.టీ. రామారావు. ఏదైనా అవసరం వుంటే చెప్పండి.. వాటిని ప్రభుత్వం వందశాతం నెరవేరుస్తుంది కానీ..
మరో రెండు వారాలు ఇలా లాక్ డౌన్లో వుండాల్సిందేనని కుండబద్దలు కొట్టారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.టీ. రామారావు. ఏదైనా అవసరం వుంటే చెప్పండి.. వాటిని ప్రభుత్వం వందశాతం నెరవేరుస్తుంది కానీ.. ఎటైనా వెళ్ళాలని అనుకుంటే మాత్రం ప్రభుత్వం అంగీకరించే సమస్యే లేదని ఖరాఖండీగా చెప్పేశారు కేటీఆర్. ఇంతకీ ఈ మాటలు ఆయన ఎవరితో అన్నారనేదే కదా మీ ప్రశ్న? రీడ్ దిస్..
లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వలస కూలీల స్థితిగతులు తెలుసుకునేందుకు వారు అధిక సంఖ్యలో వున్న ప్రాంతాల్లో పర్యటించారు కేటీఆర్. పలువురు వలస కూలీలతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్లో పని చేసేందుకు వచ్చిన సుమారు 400 మంది ఉన్న క్యాంపుని మంత్రి ఈ సందర్భంగా సందర్శించారు. ఈ క్యాంపులో ఒరిస్సా, బెంగాల్, బీహార్ పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉన్నారు.
కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా మంత్రి వెంట పర్యటించారు. ప్రస్తుతం లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుతం పనులు లేనందున వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న ఆహారం, రేషన్ సరుకుల గురించి వాకబు చేశారు. ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిందిగా సూచించారు.
త్వరలోనే కరోనా మహమ్మారి సంక్షోభం తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి అప్పటివరకు బయటికి వెళ్లకుండా వారికి ఏర్పాటు చేసిన వసతిలోనే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వలస కూలీలు ఉంటున్న వసతి ప్రాంతాల్లో (షెడ్డులో) తిరిగిన మంత్రి వారి పేరు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి వివరాలు అడిగారు. పని లేనందున సొంత ప్రాంతాలకు వెళతామన్న వారిని ఖరాఖండీగా వారించారు. ప్రస్తుతం అందరు ఇక్కడే వుండలని, లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఎవరి ఇష్ట ప్రకారం వారు చేయవచ్చని కేటీఆర్ వారికి తెలిపారు. వలస కూలీల అవసరాలను ఈ రెండు వారాల పాటు తీరుస్తూ జాగ్రత్తగా చూసుకోవాలని కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.