AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరం అప్రమత్తం.. వారి సెలవులు రద్దు

గత వారం, పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. జంటనగరాల పరిధిలో రెండు చోట్ల మనుషులు నాలాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ....

భాగ్యనగరం అప్రమత్తం.. వారి సెలవులు రద్దు
Rajesh Sharma
|

Updated on: Sep 21, 2020 | 2:17 PM

Share

గత వారం, పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని చాలా చోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. జంటనగరాల పరిధిలో రెండు చోట్ల మనుషులు నాలాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మునిసిపల్ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే రెండు వారాల పాటు వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం వుండడంతో రాష్ట్రంలో మునిసిపల్ సిబ్బంది సెలవులు రద్దు చేశారు. వచ్చే రెండు వారాల పాటు అధికారులు, ఇతర సిబ్బంది సెలవులు రద్దు చేయాలని మంత్రి.. ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలిచ్చారు.

భారీ వర్షాలు, ఆ తర్వాత ఉత్పన్నమైన పరిస్థితిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తారక రామారావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో ఉన్న పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు వారాలపాటు మునిసిపల్ సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు.

కేవలం పది రోజుల్లోనే యాభై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని ఈ సమీక్ష సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సహాయక చర్యలు చేపడుతున్నామని వారు తెలిపారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశాలిచ్చారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.