కోలాహలంగా మారిన భైరవకోన జలపాత ప్రాంతం
ఆంధ్రప్రదేశ్ ప్రకాశంజిల్లాలోని భైరవకోన జలపాతం జోరుగా పారుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఓ మోస్తరుగా ప్రవహించగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పెద్ద వర్షం కురవడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. సీఎస్ పురం మండలంలోని భైరవకోన ప్రాంతం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం ఇక్కడకి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. అయితే, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి […]
ఆంధ్రప్రదేశ్ ప్రకాశంజిల్లాలోని భైరవకోన జలపాతం జోరుగా పారుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం ఓ మోస్తరుగా ప్రవహించగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పెద్ద వర్షం కురవడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. సీఎస్ పురం మండలంలోని భైరవకోన ప్రాంతం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం ఇక్కడకి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. అయితే, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జలపాతం నుంచి జోరుగా నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రస్తుతం మామూలు రోజుల్లోనూ సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.
జలపాతం కారణంగా వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా భైరవకోనకు కిలోమీటర్ దూరంలో ఉన్న వాగు దగ్గర వాహనాలు నిలిపి వేసి అక్కడ నుంచి భక్తులు నడిచి వెళ్ళేలా చర్యలు చేపట్టారు. ఆలయాల ముందు భాగంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో త్రిముఖ దుర్గాదేవి, అదేశ్వర, నగరేశ్వర ఆలయాల్లో పూజలు నిలిపివేశారు. కాలభైరవ ఆలయంలో మాత్రమే పూజలు చేస్తున్నట్లు భైరవకోన ట్రస్టు బోర్డు తెలిపింది. ఇక, ఇక్కడికి వచ్చిన భక్తులు పూజలు చేసుకొని జలపాతం దగ్గర కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ ఆనందంతో మునిగితేలుతున్నారు.