ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష.. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..

ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్నాయి.

ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష.. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 6:49 AM

JEE Main 2021 : జేఈఈ మెయిన్ పరీక్షకు అన్ని పూర్తి చేసింది జాతీయ పరీక్షా సంస్థ ఎన్‌టీఏ. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలు ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, మరో పరీక్ష మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది.

అయితే, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లేదని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక, మన రాష్ట్రం నుంచి 73,782 మంది హాజరు కానున్నారు.

రాష్ట్రంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష ప్రారంభానికి రెండుగంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఆలస్యంగా వచ్చేవారిని లోపలికి అనుమతించబోమని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. హాల్‌టికెట్‌తో పాటు ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలిన అధికారులు సూచించారు. వీటిలో ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అప్‌లోడ్‌ చేసినట్టుగానే ఉన్న పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను కూడా విద్యార్థులు వెంట తీసురావాలని తెలిపారు.

ఎన్‌టిఏ ఇప్పటికే జేఈఈ మెయిన్ 2021 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును ఫిబ్రవరి 12న తన అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో విడుదల చేసింది. అడ్మిట్ కార్డును ఇంకా డౌన్‌లోడ్ చేయని విద్యార్థులు ఈ వెబ్‌సైట్ యాక్సెస్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఒకవేళ ఏదైనా అభ్యర్థి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, 0120-6895200 లో సంప్రదించవచ్చని లేదా jeemain@nta.ac.in లో మెయిల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టింది ఎన్‌టీఏ. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్‌టీఏ మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా హాలులో మందపాటి అరికాళ్లతో షూ, పెద్ద బటన్లతో వస్త్రాలు ధరించవద్దని విద్యార్థులను కోరింది. అలాగే క్రిమిసంహారక మానిటర్, కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ అందుబాటులో ఉంచారు. అన్ని డోర్ హ్యాండిల్స్, మెట్ల రైలింగ్, లిఫ్ట్ బటన్లు కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. అభ్యర్థులు అన్ని సమయాల్లో కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది అందించిన సూచనలను విద్యార్థులు పాటించాల్సి ఉంటుంది.

Read Also.. ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్నారా..! అయితే ముందుగా టీఎస్పీఎస్సీ గురించిన సమాచారం తెలుసుకోండి..