ప్రేమజంటను కారుతో ఢీకొట్టిన బంధువులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరో ప్రేమ జంటపై పెద్దలు కక్ష్య కట్టారు. ఎదురించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఎకంగా కారుతో ఢీకొట్టి హతమార్చాలనుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు.

ప్రేమజంటను కారుతో ఢీకొట్టిన బంధువులు.. ఇద్దరికి తీవ్రగాయాలు
Follow us

|

Updated on: Oct 09, 2020 | 7:20 AM

మరో ప్రేమ జంటపై పెద్దలు కక్ష్య కట్టారు. ఎదురించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఎకంగా కారుతో ఢీకొట్టి హతమార్చాలనుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను విడదీసేందుకు వారు టూ వీలర్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన నాగజ్యోతి, అక్షయ్‌లు ప్రేమించుకున్నారు. 2019 మే 28న వివాహం చేసుకున్నారు. 15 నెలలు కలిసి కాపురం కూడా చేస్తున్నారు. అయితే, నెల రోజుల క్రితం తల్లికి గుండెనొప్పి వచ్చిందని నాగజ్యోతిని కుటుంబసభ్యులు ఇంటికి పిలిపించుకున్నారు. తమకు నచ్చని పెళ్లి చేసుకున్నావని, విడాకులు తీసుకోవాలని ఒత్తిడిచేశారు. లేదంటే అక్షయ్‌ని చంపేస్తామని బెదిరించి ఆగస్టులో విడాకులు ఇప్పించారు.

ఇదిలావుంటే ఆ జంట వేరుగా ఉంటున్నప్పటికీ వారి మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కుంటాల మండలం కల్లూర్‌ వాసవి కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు నాగజ్యోతి వెళ్లింది. పరీక్ష తర్వాత అక్షయ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై భైంసాకు వస్తుండగా ఆమె సోదరులు ముగ్గురు వెంబడించి.. బిజ్జూర్‌-చింతల్‌బోరి గ్రామాల మధ్య కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. నాగజ్యోతికి తీవ్రగాయాలు కాగా, అక్షయ్‌పై కర్రలతో దుండగులు దాడిచేశారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు.. నాగజ్యోతి, అక్షయ్‌లను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భైంసా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.