Sharmila – Avinash: షర్మిల రెడ్డి vs అవినాష్ రెడ్డి.. అందరి చూపు కడపపైనే.. మోస్ట్‌ ఇంట్రస్టింగ్‌ బ్యాటిల్..!

|

Apr 03, 2024 | 1:12 PM

అక్క ఫిక్స్‌ అయింది. తమ్ముడు ఎప్పుడో రెడీ. ఇక కడప బరిలో తలపడడమే మిగిలింది. ఇద్దరికీ ఉన్న బ్రాండ్‌.. వైఎస్‌ పేరే. మరి ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారు కడప ప్రజలు..! వైఎస్‌ కుటుంబానికి గట్టి పట్టున్న గడ్డపై ఆ ఫ్యామిలీ వాళ్లే రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతుంటే.. ఎవరిని డిసైడ్‌ చేసుకోవాలి జనం. ఇంతకీ, కడప జిల్లాలో ఎవరికి బలం ఎక్కువ? వైఎస్‌ అవినాశ్ రెడ్డికా, వైఎస్ షర్మిలకా?

Sharmila - Avinash: షర్మిల రెడ్డి vs అవినాష్ రెడ్డి.. అందరి చూపు కడపపైనే.. మోస్ట్‌ ఇంట్రస్టింగ్‌ బ్యాటిల్..!
YS Avinash - YS Sharmila
Follow us on

అసలు వైఎస్ షర్మిల బలం ఎంత? అన్నికంటే ముందు మాట్లాడుకోవాల్సిన అంశమిది. నిజంగా కడప జిల్లాలో షర్మిలకు పొలిటికల్‌ పవర్‌ ఉందా? ఎందుకని కడపలో.. అది కూడా వైఎస్‌ అవినాశ్‌కు పోటీగా బరిలో దిగుతున్నారు? వైఎస్‌ అనే ఒక్క పేరు, రాజశేఖర్‌రెడ్డి బిడ్డ అన్న అభిమానం మాత్రమే షర్మిలను గెలిపిస్తుందా? అదే నిజం అయితే.. అదే వైఎస్‌ ఫ్యాక్టర్‌ వైఎస్ జగన్‌కు కూడా కలిసివస్తున్నట్టేగా. పైగా కడప ఎంపీ అభ్యర్ధిగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని స్వయంగా నిలబెట్టింది వైఎస్ జగనే. తన తమ్ముడిని గెలిపించండని అడుగుతున్నారు. అలాంటిది తమ్ముడ్ని ఓడించేందుకు అక్క ప్రయత్నం ఫలిస్తుందా? 2009 ముందు వరకు కడప జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. 2009లో వైఎస్‌ జగన్‌ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచే. ఆ తరువాత కడప లోక్‌సభ వైసీపీకి కంచుకోటగా మారింది. ఆమాటకొస్తే.. కడప జిల్లాలో ఇప్పటికీ వైఎస్ కుటుంబానికే పట్టు ఉంది. వైఎస్‌ షర్మిలకు కడప జిల్లాపై ఎంత పట్టు ఉందన్నది ఇప్పటి వరకు తెలీదు. ఎందుకంటే.. ఇంతవరకు షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి. ఒకప్పుడు కలిసి ఉన్న వైఎస్ జగన్, వైఎస్ షర్మిల.. ఇప్పుడు వేరయ్యారు, రాజకీయ ప్రత్యర్ధులుగానూ మారారు. మరి కడప ప్రజలు కూడా అలాగే చీలిపోతారా? ఇప్పటి వరకు వైఎస్‌ను చూసి, జగన్‌ మాట విని ఓటు వేసి గెలిపించిన కడప ప్రజలు.. షర్మిల వైపు వెళ్తారా?

ఇంకో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అసలు క‌డ‌ప జిల్లాతో వైఎస్‌ షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటి? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సొంత గడ్డ కడప. షర్మిల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు. అంతే. అంతేతప్ప కడపతో షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటని జిల్లా ప్రజల నుంచి, వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సరే.. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా షర్మిలపై అభిమానం ఉంటే ఉండొచ్చు. కాని, కాంగ్రెస్‌ పార్టీకి గానీ, వ్యక్తిగతంగా షర్మిలకు గానీ కడప జిల్లాలో ఉన్న బలం ఎంత అనే ప్రశ్న కూడా వినిపిస్తోందిప్పుడు. ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో క‌డ‌ప‌, పులివెందుల‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, క‌మ‌లాపురం, మైదుకూరు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పైగా వైఎస్‌ అభిమానులు ఇప్పటికీ ఒప్పుకోని అంశం ఒకటుంది. వైఎస్‌ చనిపోయిన తరువాత జగన్‌ను ఓదార్పుయాత్ర చేయకుండా అడ్డుకున్నది, సీబీఐ కేసులు పెట్టి జైలుకు పంపింది, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్‌ పేరు ప్రస్తావనకు వచ్చేలా చేసిందీ కాంగ్రెస్‌ పార్టీనే అన్న భావన ఉంది. అలాంటప్పుడు వైఎస్‌ అభిమానులు షర్మిల వెనక నడుస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

కాకపోతే ఒకటి. 1989 నుంచి ఇక్కడ వైఎస్‌ ఫ్యామిలీనే పోటీ చేస్తోంది, గెలుస్తోంది కూడా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరువాత కడప ఎంపీగా గెలిచింది వైఎస్‌ వివేకానంద రెడ్డే. పైగా రెండుసార్లు గెలిచారు. కడప జిల్లాలో వైఎస్‌ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి పెద్దదిక్కుగా కనిపించింది వైఎస్‌ వివేకానందరెడ్డే. ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంట్‌తో కడప ఎంపీగా బరిలో దిగుతున్నారు. తనను కడప లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయించాలన్నది వైఎస్ వివేకా ఆఖరి కోరిక అంటూ చెప్పుకొచ్చారు. ఆనాడు రెండు గంటల పాటు తనను ఒప్పించే ప్రయత్నం చేసినా.. అలా ఎందుకు బతిమాలుతున్నారో ఆరోజు తనకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా.. వివేకా ఫ్యామిలీకి న్యాయం జరగాలన్న కారణంతోనే కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

షర్మిలకు కడప జిల్లాలో బలం ఉందా లేదా అని పక్కనపెడితే.. వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు గానీ, పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత గానీ.. వైఎస్ షర్మిల దూకుడు మామూలుగా లేదు. వాళ్లు వీళ్లు అని చూడ్డం లేదు. ప్రత్యర్థులపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. పైగా కడప ఎంపీ అభ్యర్ధిగా వైఎస్‌ వివేకా హత్యను మరింత గట్టిగా ఫోకస్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కాస్త ఇరుకున పెట్టే అంశమే. దీన్ని అవినాశ్‌రెడ్డి ఎలా ఫేస్‌ చేస్తారన్న దాన్ని బట్టే కడప ఎన్నికల ఫలితం ఉంటుంది. పైగా వివేకా కూతురు వైఎస్ సునీత, వివేకా భార్య సౌభాగ్మమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉన్నారు. రేపు ఎన్నికల ప్రచారంలోనూ కనిపించొచ్చు. వైఎస్ వివేకా కుటుంబం అంతా ఒకే వేదికపైకి వచ్చి ప్రచారం చేస్తే అది అవినాశ్‌రెడ్డికి ఇబ్బందిగానూ మారొచ్చు.

ఇదిలా ఉంటే.. వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ క్లాష్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది కూటమి. ఇప్పటికే, కడప లోక్‌సభ కూటమి అభ్యర్ధిగా టీడీపీ నేత భూపేష్‌ రెడ్డి పేరు ప్రకటించారు. అయితే, షర్మిల, అవినాశ్‌ మధ్య ఓట్లు చీలితే.. అది కూటమికి కలిసొచ్చేలా ఉండేందుకు అభ్యర్ధిని మార్చే ఆలోచన కూడా చేస్తున్నారట. జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న ఆదినారాయణరెడ్డిని తీసుకొచ్చి కడప ఎంపీగా పోటీచేయించాలనేది ఓ ప్లాన్. ఆదినారాయణరెడ్డి అన్న కొడుకే భూపేష్‌రెడ్డి. సో, బంధుత్వం ఉన్న కారణంగా సీట్ల మార్పు చేసినా పెద్దగా అభ్యంతరాలు రావు అనేది ఓ అంచనా. పైగా భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగులోనే కొంత బలం ఉంది తప్ప.. కడప ఎంపీ సెగ్మెంట్‌ను ప్రభావితం చేయలేరనేది పార్టీల్లో నడుస్తున్న టాక్. అదే ఆదినారాయణరెడ్డి అయితే.. గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. అందుకే, వైఎస్ వర్సెస్‌ వైఎస్‌ పోటీలో ఓట్లు చీలితే.. కూటమికి లాభం కాబట్టి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా తనకు అవకాశం ఇవ్వండని అడుగుతున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పటికైతే కూటమి పార్టీల నుంచి అంగీకారం రాలేదు గానీ.. ఈ ప్రతిపాదనపై ఇంకా చర్చలైతే జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కడప ఫైట్‌ ఈసారి రసవత్తరంగా ఉండబోతోందన్నది నిజం. షర్మిల గెలిచినా ఓడినా.. వైఎస్‌ వివేకా హత్యపై ప్రజాతీర్పు ఇచ్చినట్టే లెక్క..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..