విశాఖలో సెక్రటేరియట్‌కు స్థలం రెడీ.. సీఎం గ్రీన్ సిగ్నల్!

విశాఖలో సచివాలయంను నిర్మించనున్నారనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా రెడీ చేసినట్లు..

విశాఖలో సెక్రటేరియట్‌కు స్థలం రెడీ.. సీఎం గ్రీన్ సిగ్నల్!
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 4:51 PM

విశాఖలో సెక్రటేరియట్‌ను నిర్మించేందుకు స్థలం రెడీ అయ్యింది. దీనికి ఏపీ సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఏపీలో మూడు రాజధానుల అంశంపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో సచివాలయంను నిర్మించనున్నారనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణం కోసం స్థలాన్ని కూడా రెడీ చేసినట్లు సమాచారం. వైజాగ్‌లోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయంను నిర్మించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందట.

నిజానికి ముందు మిలీనియం టవర్స్‌లో సచివాలయంను ఏర్పాటు చేస్తారని అందరూ భావించినా.. కొన్ని అనివార్య కారణాలతో ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. గతంలో కాపులప్పాడ కొండపై ఐటీ లే అవుట్‌ని రూపొందిచారు. అదానీ సంస్థ ఈ కొండపై డేటా పార్కును ఏర్పాటు చేస్తామనడంతో.. ముందు ఈ స్థలాన్ని కేటాయించారు. అయితే కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడే పెడతామని ఆ సంస్థ చెప్పడంతో.. వేరే చోట స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.

ప్రస్తుతం కొండపై 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, 250 ఎకరాల్లో లే అవుట్ వేశారు. ఇప్పటికే 175 ఎకరాల స్థలాన్ని చదును చేయగా.. మరో 600 ఎకరాల స్థలాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే కొండపై సచివాలయం, గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణాలు ఏర్పడనున్నాయని తెలుస్తోంది. అటు.. అమరావతిలో రైతులు మాత్రం మూడు రాజధానులకు విరుద్ధంగా.. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరగనుందో తెలియాలి.