అప్యాయత, అనురాగం వెనుక దాగి ఉన్న కుతంత్రం.. రెప్పపాటు గాలిలో కలుస్తున్న ప్రాణాలు!

| Edited By: Balaraju Goud

Sep 06, 2024 | 3:18 PM

అప్యాయంగా ఆహారాన్ని అందిస్తారు. అనురాగాన్ని వలకబోస్తూ, కూల్ డ్రింక్ ఇస్తారు. ఆ అప్యాయత, అనురాగం వెనుక కుతంత్రం ఉంటుంది. అప్పులు ఎగ్గొట్టాలనో, బంగారు ఆభరణాలు దోచుకోవాలనో, ఆస్తులు కాజేయాలనో ఇలా ఏదో ఒక లక్ష్యంతో అంతులేని మమకారాన్ని చూపిస్తారు.

అప్యాయత, అనురాగం వెనుక దాగి ఉన్న కుతంత్రం.. రెప్పపాటు గాలిలో కలుస్తున్న ప్రాణాలు!
Guntur Crime Story
Follow us on

అప్యాయంగా ఆహారాన్ని అందిస్తారు. అనురాగాన్ని వలకబోస్తూ, కూల్ డ్రింక్ ఇస్తారు. ఆ అప్యాయత, అనురాగం వెనుక కుతంత్రం ఉంటుంది. అప్పులు ఎగ్గొట్టాలనో, బంగారు ఆభరణాలు దోచుకోవాలనో, ఆస్తులు కాజేయాలనో ఇలా ఏదో ఒక లక్ష్యంతో అంతులేని మమకారాన్ని చూపిస్తారు. వారి బుట్టలో పడితే ఇక ప్రాణాలు దక్కనట్టే..! ఇలా ఒకరిద్దరూ కాదు ఏకంగా నలుగురిని హతమార్చారు. మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. ఇదంతా చేసింది మాత్రం ముగ్గురు మహిళలే..! సైనేడ్ తో క్షణాల్లోనే హత్య చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య..!

అది తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ. ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్‌పై వచ్చింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ చేత రజిని బ్రీజర్ కొనిపించింది. రజిని, నాగూర్ బీ, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్ బీ కి ఇవ్వాలనుకున్న బ్రీజర్‌లో సైనేడ్ కలిపి ఇచ్చారు రజిని, వెంకటేశ్వరి. బ్రీజర్ త్రాగిన వెంటనే నాగూర్ బీ చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలును తీసుకుని ఇద్దరూ మహిళలు అక్కడ నుండి వెళ్లిపోయారు.

అయితే నాగూర్ బీ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్‌ను విచారించగా రజిని అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్ చెప్పాడు. యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజినిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారు ఆభరణాలు కోసం నాగూర్ బీ కి సైనేడ్ కలిపిన బ్రీజర్ త్రాగించినట్లు ఆ ఇద్దరూ మహిళలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో ముగ్గరు మహిళలకు సైనేడ్ ఇచ్చి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నారు.

2022 లో మార్కాపురంకు చెందిన సుబ్బలక్ష్మీని ఆమె ఆస్తి, డబ్బుల, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మీ స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్స్అప్‌లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే అనే వ్యక్తి తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే ఫెన్షన్, ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు.

ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. వారికి ఆహారం, కూల్ డ్రింగ్, టీ లలో సైనేడ్ కలిపి ఇవ్వగా చివరి సమయంలో ప్లాన్స్ వర్కవుట్ అవ్వలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు పోలీసుల విచాణలో వెల్లడైంది. ఈ హత్యలన్నింటింకి ముగ్గురు మహళలే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వీరికి సైనేడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. నమ్మకంగా మన మధ్యే ఉంటూ చిటికెలో ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..