Visakha Accident News: స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో లారీని ఢీకొట్టింది.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..! రంగంలోకి ఆర్టిఏ

| Edited By: Jyothi Gadda

Nov 22, 2023 | 8:15 PM

visakhapatnam: ఆటో, లారీ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. హాసిని ప్రియ కు సర్జరీ చేశారు వైద్యులు. వాణి జయరాం, గణిత గాయత్రి, లక్ష్య, చార్విక్, కెయుష్, కుషల్, భావేశ్ లు కోలుకుంటున్నారు. హాసిని ప్రియకు సర్జరీ పూర్తయిందని .. సర్జరీ సక్సెస్ అయినట్టు వైద్యులు చెప్పారని పేరేంట్స్ అన్నారు. మిగతా విద్యార్థులు కోలు కుంటున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది.. బాధితులకు పూర్తి వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేసిందని

Visakha Accident News: స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో లారీని ఢీకొట్టింది.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..! రంగంలోకి ఆర్టిఏ
Visakhapatnam Road Accident
Follow us on

విశాఖపట్నం, నవంబర్‌22; – విశాఖ లో ఆ రోడ్డు ప్రమాదం ఊహించుకుంటూనే ఒళ్ళు జలదరిస్తోంది. సిసి కెమెరాలో దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. విశాఖ సంఘం శరత్ జంక్షన్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది . ఘటనస్థలిలో పరిస్థితిని చూసి.. ఆటో డ్రైవర్ మాటలతో లారీ డ్రైవర్ పై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. సీసీ ఫుటేజ్ అసలు విషయం బయట పెట్టేసింది. స్కూలు ఆటో ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఎక్కించుకొని వెళ్లడం.. అతివేగం ప్రమాదానికి కారణమైంది.

ప్రమాదం అలా జరిగింది..

– అది బుధవారం ఉదయం 7:30 సమయం..! విశాఖలోని బేతని స్కూలు విద్యార్థులను ఎక్కించుకుని వారి ఇళ్ళ నుంచి బయలుదేరాడు ఆటో డ్రైవర్. మరో ఐదు నిమిషాల్లో స్కూలుకు చేరుకుంటారు. ఉదయం 7.25 గంటలకు సంఘం జంక్షన్..! డైమండ్ పార్క్ వైపు నుంచి వెళ్తున్న ఆటో.. అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లేందుకు సంఘం శరత్ జంక్షన్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తోంది. అప్పటికే రైల్వే స్టేషన్ వైపు నుంచి ఆసిలు మెట్ట వైపు ఓ లారీ జంక్షన్ క్రాస్ చేస్తూ మధ్య వరకు వచ్చేసింది. హై స్పీడ్ గా స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో.. లారీ ముందు భాగం ఎడమవైపు బలంగా ఢీకొట్టింది. నిర్లక్ష్యంతో ఆటోను డ్రైవర్ కంట్రోల్ చేయలేక జంక్షన్ దాటుతున్న లారీను అతివేగంతో వెళ్లి ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాత ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమంది విద్యార్థులు కిందపడిపోయారు. మరి కొంతమంది ఆటోలోనే చిక్కుకున్నారు. దీంతో స్థానికులు పరుగులు పెట్టి వెళ్లి విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ తో కలిపి అందులో 9 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో డ్రైవర్ సహా ఎనిమిది మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

బాధితులను పరామర్శించిన వైవి సుబ్బారెడ్డి.. ప్రభుత్వం తరపున వైద్య సాయం..

– స్కూల్ ఆటో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్ నాధ్ బాధితులను పరామర్శించారు. ఆటో ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్య సహాయం అందేలా చూస్తామన్నారు వైవి. వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకొని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం సరికాదని అన్నారు. గాయపడిన వారిలో కొందరు స్వల్ప గాయాలతో కోలుకుంటున్నారని చెప్పారు… సర్జరీ అవుతున్న మరో బాలిక కూడా కోలుకుంటుందని వైద్యులు చెప్పారని అన్నారు. స్కూలు పిల్లలు సేఫ్ గా పాఠశాలలకు వెళ్లేలా.. సురక్షిత ప్రయాణాలు ఏర్పాట్లు చేసుకునేలా.. స్కూలు బస్సులుంటే వాటిలోనే వెళ్లేలా పేరెంట్స్ కు కౌన్సెలింగ్ చేయాలని డీఈఓ, ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పరిమితికి మించి స్కూలు పిల్లలను ఆటోలో తరలిస్తున్న వాహనాలపై డ్రైవ్ విస్తృతం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు.

కోలుకుంటున్న విద్యార్థులు..ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

– ఆటో, లారీ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. హాసిని ప్రియ కు సర్జరీ చేశారు వైద్యులు. వాణి జయరాం, గణిత గాయత్రి, లక్ష్య, చార్విక్, కెయుష్, కుషల్, భావేశ్ లు కోలుకుంటున్నారు. హాసిని ప్రియకు సర్జరీ పూర్తయిందని .. సర్జరీ సక్సెస్ అయినట్టు వైద్యులు చెప్పారని పేరేంట్స్ అన్నారు. మిగతా విద్యార్థులు కోలు కుంటున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించింది.. బాధితులకు పూర్తి వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించిన వ్యక్తికీ .. రుణపడి ఉన్నామని అంటున్నారు బాధిత పేరెంట్స్.

– ఆటో డ్రైవర్ పై కేసు..

– ఆటో ను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అప్పలరాజు పై పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో లారీ డ్రైవర్ పారిపోవడం, ఆపై క్లీనర్ కూడా పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. లారీ నడుపుతున్న వారిపై స్థానికులు ఆరోపణలు చేశారు. ఆటో డ్రైవర్ అప్పలరాజు కూడా తాను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తన తప్పులేదని చెప్పుకొచ్చాడు. దీంతో సిసి ఫు్టేజి వెరిఫై చేసేసరికి.. అసలు విషయం బయటపడింది. ఆటో డ్రైవర్ అప్పలరాజు.. అతివేగంగా వస్తూ కంట్రోల్ చేయకపోవడం వల్లే లారీని ఢీకొని ప్రమాదానికి కారణమైనట్టు నిర్ధారించారు పోలీసులు. ఆటోలో పరిమితకి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్నట్టు గుర్తించారు. స్కూలు సమయానికి చేరుకోలేకపోతామన్న ఆలోచనతో హై స్పీడ్ గా వెళ్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ఇంతటి ప్రమాదానికి దారి తీసింది అన్నారు డిసిపి శ్రీనివాసరావు. పేరెంట్స్ కూడా పిల్లలకు ఆటోల్లో పంపే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఒకే రోజు రెండు వేరువేరు ప్రమాదాలు.. అప్రమత్తమైన ఆర్టిఏ అధికారులు..

– విశాఖలో రెండు వేరువేరు చోట్ల స్కూల్ ఆటోలు ప్రమాదలకు గురయ్యాయి. సంగం సార్ జంక్షన్లో డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని ఆటో ఢీకొనడంతో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. మరోవైపు మధురవాడలో మరో స్కూల్ ఆటో పరిమితికి మించి వెళ్తూ.. బోల్తా పడింది. పంది నీ తప్పించబోయి ఆటోను డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆటో ప్రమాదాలపై అప్రమత్తమైన ఆర్టిఏ అధికారులు…డ్రైవ్స్ విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఒక ఆటోలో ఆరుగురు మాత్రమే ప్రయాణించాలని అన్నారు డిటిసి రజారత్నం. ఇప్పటికే స్కూల్ బస్సులు ఆటోలపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలోనే నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై 28 కేసులు నమోదు చేశామన్నారు డిటిసి. ఇకనుంచి డ్రైవ్స్ మరింత విస్తృతం చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి పై కేసులు నమోదు చేస్తామని. . వాహనాలను సీజ్ చేస్తామన్నారు. సంఘం సర్ఫ్ జంక్షన్లో జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమైందని చెప్పారు డిటిసి రాజరత్నం. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నారని అన్నారు.

– విశాఖలో ఒకేరోజు ఒకే సమయంలో రెండు వేరువేరు చోట్ల స్కూలు ఆటోలు ప్రమాదానికి గురి కావడంతో.. పేరెంట్స్ లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం సరేసరి.. అధికారులు కూడా డ్రైవ్ చేస్తారు కేసులు పెడతారు. కానీ.. స్కూలుకు పంపే పేరెంట్స్ కూడా పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..