Vizag: తీరానికి వచ్చిన భారీ డాల్ఫిన్.. తిరిగి తీసుకెళ్లి నీటిలోకి వదిలినా…. పాపం
తిరిగి దాన్ని నీటిలోకి పంపేందుకు యువకుల ప్రత్నించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం తంతడి – వాడపాలెం తీరానికి అరుదైన ఓ డాల్ఫిన్ కొట్టుకు వచ్చింది. అనారోగ్యమో, మరే ఇతర కారణమోగానీ సముద్ర తీరానికి వచ్చి చాలాసేపు అక్కడే తిరిగింది. అయితే ఇసుక వైపు వచ్చేస్తున్న ఆ సముద్రపు డాల్ఫిన్ను… గుర్తించిన స్థానిక యువకులు తిరిగి లోపలకు పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణాల విడిచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..వాడపాలెం తీరానికి బుధవారం మధ్యాహ్నం డాల్ఫిన్ (మత్స్యకారులు గనుము అంటారు) కొట్టుకువచ్చింది. దానిని కొవిరి గోవిందరావు, వంకా ప్రశాంత్ అనే యువకులు చూశారు. కొనఊపిరితో వున్న డాల్ఫిన్ను అతి కష్టం మీద సముద్రంలోకి నెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. చనిపోయి తిరిగి తీరానికి కొట్టుకు వచ్చింది. మత్స్యకారులు డాల్ఫిన్ను తినరు. అందుకే వలలకు చిక్కినా తిరిగి సముద్రంలోనే వదిలేస్తారు. లోతైన సముద్రంలోనే తప్ప… తీరంలో ఈ డాల్ఫిన్లు కనబడవు. అయితే చుట్టుపక్కల వున్న కర్మాగారాల నుంచి వ్యర్థ జలాలు సముద్రంలో కలవడంతో నీరు కలుషితమై సముద్ర జీవులు మృతికి కారణమై ఉండొచ్చని మత్స్యకారులు అంటున్నారు. 8 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో దాదాపు 200 కిలోల వరకు ఉంటుంది. ఈ అరుదైన డాల్ఫిన్ ఇలా మృత్యువాత పడి ఒడ్డుకు చేరడంతో స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
